సానియా సందడి:
బుధవారం రాత్రి ఉప్పల్ వేదికగా సన్రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో సెలెబ్రిటీలు సన్రైజర్స్కు మద్దతిచ్చారు. భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా ఉప్పల్ మైదానంకు వచ్చి సన్రైజర్స్కు మద్దతిచ్చింది. సన్రైజర్స్ ఆటగాళ్లు బౌండరీలు బాదినప్పుడల్లా అభిమానులతో కలిసి సందడి చేసింది. అంతేకాదు ఆరెంజ్ ఆర్మీకి మద్దతివ్వండని కోరింది. కుమారుడికి జన్మనివ్వడంతో ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్న సానియా బుధవారం సన్రైజర్స్ మ్యాచ్ వీక్షించింది.

అభిమానులతో కిక్కిరిసిపోయిన మైదానం:
సొంతగడ్డపై జరుగుతోన్న మ్యాచ్ కావడంతో సినీ నటులు సుమంత్, సుశాంత్లు కూడా మ్యాచ్కు హాజరయి సందడి చేశారు. స్థానిక ఉప్పల్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ను చూడటానికి హైదరాబాద్ అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఈ మ్యాచ్ కోసం టికెట్లన్నీ ఎప్పుడో అమ్ముడవడంతో.. మైదానం మొత్తం ప్రేక్షకులతో కళకళలాడింది. సన్రైజర్స్, చెన్నై మద్దతుదారులతో స్టేడియం మొత్తం ఆరెంజ్, పసుపు జెండాలతో నిండిపోయింది. అభిమానుల అరుపులతో ఉప్పల్ మైదానం మొత్తం మోత మోగింది.

సన్ స్ట్రోక్:
ఉప్పల్ వేదికగా బుధవారం జరిగిన మ్యాచ్లో చెన్నై సూపర్కింగ్స్పై సన్రైజర్స్ హైదరాబాద్ 6 వికెట్ల తేడాతో గెలిచింది. తొలుత బ్యాటింగ్కు చేసిన చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 132 పరుగులు చేసింది. డుప్లెసిస్ (31 బంతుల్లో 45; 3 ఫోర్లు, 3 సిక్సర్లు), వాట్సన్ (29 బంతుల్లో 31; 4 ఫోర్లు)లు రాణించారు. అనంతరం లక్ష్య ఛేదనలో సన్రైజర్స్ 16.5 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 137 పరుగులు చేసి విజయం సాధించింది. వార్నర్ (25 బంతుల్లో 50; 10 ఫోర్లు), బెయిర్స్టో (44 బంతుల్లో 61 నాటౌట్; 3 ఫోర్లు, 3 సిక్స్లు) అర్ధ సెంచరీలు చేశారు.


Click it and Unblock the Notifications












