CSK VS SRH: ఐపీఎల్ 2025లో భాగంగా తాజాగా చెపాక్ స్టేడియం వేదికగా సన్రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ చెన్నై సపర్ కింగ్స్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచు ధోనీకి 400వ టీ20 కావడం విశేషం. దీంతో ఈ మైలరాయి మ్యాచు కోసం క్రికెట్ అభిమానులు భారీ స్థాయిలో చెపాక్ స్టేడియానికి తరలివచ్చారు. అయితే ఈ మ్యాచులో ధోనీ (Dhoni) తన బ్యాటును సుత్తితో దబా దబా బాదుతూ కనిపించాడు. ఎందుకంటే?
ఐపీఎల్ 2025లో అంపైర్లు అనుమానం వస్తే.. క్రీజులోకి వస్తోన్న బ్యాటర్ల బ్యాట్లను తనిఖీలు చేస్తోన్న చేస్తోన్న సంగతి తెలిసిందే. బ్యాట్లు.. నిబంధనలకు అనుగుణంగా ఉన్నాయా లేదా అని గాజ్ టెస్ట్ నిర్వహిస్తున్నారు. అయితే ఈ మ్యాచులో మొదట బ్యాటింగ్ చేసిన సీఎస్కేను ఆదిలోనే షాకిచ్చాడు షమీ. ఇన్నింగ్స్ తొలి బంతికే షేక్ రషీద్ను గోల్డెన్ డక్ చేశాడు. ఆ తర్వాత శామ్ కరణ్ ప్రభావం చూపలేకపోయాడు. 10 బంతుల్లో 9 పరుగులు మాత్రమే చేసి హర్షల్ పటేల్ బౌలింగ్ లో వెనుదిరిగాడు.
కరణ్ ఔట్ అవ్వడంతో జడేజా క్రీజులోకి వచ్చాడు. అయితే జడేజా రాగానే.. ఆన్ ఫీల్డ్ అంపైర్ గాజ్ టెస్ట్ చేశాడు. కానీ అందులో జడ్డూ బ్యాట్ విఫలమైంది. దీంతో జడేజా బ్యాటును బలవంతంగా మార్చి ఆడాల్సి వచ్చింది. ఈ సంఘటన జరగగానే కెమెరాలన్నీ సీఎస్కే డ్రెస్సింగ్ రూమ్ వైపు తిరిగాయి.
అయితే ఆ వీడియోలో.. జడ్డూ బ్యాట్ చెక్ చేయగానే, ఆ వెంటనే ధోనీ ముందు జాగ్రత్త పడ్డాడు. తన బ్యాట్ ను స్వయంగా గాజ్ టెస్ట్ చేసుకున్నాడు. ఏదో తేడాగా అనిపించడంతో డ్రెస్సింగ్ రూమ్ లోనే కాసేపు తన బ్యాటును సుత్తితో బాది సరిచేశాడు. దీనికి సంబంధించి వీడియో వైరల్ గా మారింది. ఆ తర్వాత అదే బ్యాటుతో క్రీజులోకి దిగాడు మహీ. కానీ తన బ్యాటను ఝళిపించలేకపోయాడు. 10 బంతులు ఎదుర్కొని ఒక్క ఫోర్ సాయంతో 6 పరుగులు మాత్రమే చేశాడు. 16.3 ఓవర్ దగ్గర అభిషేక్ శర్మకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో సీఎస్కే, ధోనీ అభిమానులంతా నిరాశచెందారు. ఒక్కసారిగా చెపాక్ స్టేడియం కూడా మూగబోయింది.
