CSK VS SRH: ఐపీఎల్ 2025లో భాగంగా తాజాగా చెపాక్ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచులో సన్రైజర్స్ హైదరాబాద్ విజయం సాధించింది. చెన్నై సపర్ కింగ్స్ పై ఐదు వికెట్ల తేడాతో గెలుపొందింది. చెపాక్ స్టేడియంపై 12 ఏళ్ల తర్వాత తొలిసారి అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఈ విజయంతో సన్రైజర్స్ ప్లేఆఫ్స్ ఆశలు సజీవంగా నిలిచాయి. అలానే ఈ ఓటమితో చెన్నై ప్లే ఆఫ్స్ అవకాశాలు దాదాపు ముగిసినట్లే.
మొదట హైదరాబాద్ జట్టు బౌలర్లు విజృంభించడం వల్ల సీఎస్కే 19.5 ఓవర్లలో 154 పరుగులకు ఆలౌట్ అయింది. హైదరాబాద్ బౌలర్లు క్రమంగా వికెట్లు తీయడంతో సీఎస్కే తక్కువ స్కోరుకే కుప్పకూలింది. హర్షల్ పటేల్(4/28) సీఎస్కే జట్టును గట్టిగా దెబ్బతీశాడు. చెన్నై జట్టులో డేవాల్డ్ బ్రేవిస్ (42) టాప్ స్కోరర్ గా నిలిచాడు. ఆయుశ్ మాత్రే (30), రవీంద్ర జడేజా(21), శివమ్ దూబే(12), ధోనీ(6), నూర్ అహ్మద్(2) పరుగులు చేశారు.
అనంతరం లక్ష్య ఛేదనలో హైదరాబాద్ 18.4 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఇషాన్ కిషన్ (34 బంతుల్లో 44: 5 ఫోర్లు, ఒక సిక్స్), కమిందు మెండిస్ (22 బంతుల్లో 32*: 3 ఫోర్లు), నితీశ్ కుమార్ రెడ్డి (13 బంతుల్లో 19*: 2 ఫోర్లు) మంచి ప్రదర్శన చేశారు. చెన్నై బౌలర్లలో నూర్ అహ్మద్ 2, ఖలీల్ అహ్మద్, అన్షుల్ కంబోజ్, రవీంద్ర జడేజా తలో వికెట్ దక్కించుకున్నారు.
సన్రైజర్స్ ప్లే ఆఫ్స్ చేరాలంటే?
ఈ విజయంతో సన్రైజర్స్ హైదరాబాద్ తన ప్లే ఆఫ్స్ అవకాశాలను సజీవంగా నిలుపుకుంది. ఈ సీజన్ లో ఆరెంజ్ ఆర్మీకి ఇది మూడో విజయం. ఇక ప్లే ఆఫ్స్కు చేరాలంటే మిగతా అన్ని మ్యాచులు అన్నింటిలోనూ ఎస్ఆర్హెచ్ విజయం సాధించాలి. మరోవైపు చెన్నై సూపర్ కింగ్స్ కు ఇది ఏడో ఓటమి కావడం గమనార్హం. 9 మ్యాచుల్లో ఏడింటిలో ఓడింది. కాబట్టి ఇకపై మిగతా అన్ని మ్యాచ్ల్లో విజయం సాధించినా ఆ జట్టుకు ప్లే ఆఫ్స్ అవకాశాలు కష్టమే. అంటే ఈ ఓటమితో సీఎస్కే దాదాపు టోర్నీ నుంచి నిష్క్రమించినట్లే.
