ప్లేఆఫ్స్ అవకాశాలు మెరుగుపర్చుకోవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ అదరగొట్టింది. వరుస పరాజయాల అనంతరం గొప్పగా పుంజుకుని తిరిగి గెలుపు బాట పట్టింది. సొంతమైదానంలో చెపాక్ వేదికగా సన్రైజర్స్ హైదరాబాద్తో జరిగిన మ్యాచ్లో 78 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. పది పాయింట్లతో ఆరో స్థానం నుంచి మూడో స్థానానికి ఎగబాకింది.
మొదట బ్యాటింగ్ చేసిన సీఎస్కే నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 212 పరుగులు చేసింది. రుతురాజ్ గైక్వాడ్ (98; 54 బంతుల్లో, 10x4, 3x6) తృటిలో శతకాన్ని కోల్పోయాడు. డారిల్ మిచెల్ (52; 32 బంతుల్లో, 7x4, 1x6), శివమ్ దూబె (39*; 20 బంతుల్లో, 1x4, 4x6) కీలక ఇన్నింగ్స్ ఆడారు.

అనంతరం ఛేదనలో సన్రైజర్స్ 18.5 ఓవర్లలో 134 పరుగులకు ఆలౌటైంది. మార్క్రమ్ (32; 26 బంతుల్లో, 4x4) టాప్ స్కోరర్. సీఎస్కే బౌలర్లలో తుషార్ దేశ్పాండే (4/27) నాలుగు వికెట్లు, ముస్తాఫిజుర్ (2/19), పతిరనా (2/17) చెరో రెండు వికెట్లు తీశారు. కాగా, మ్యాచ్ అనంతరం చెన్నై నయా కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ తన, తమ జట్టు ప్రదర్శన గురించి మాట్లాడాడు. టాస్ ఓడిపోవడం తమకు కలిసొచ్చిందని అన్నాడు. విజయం పట్ల సంతోషం వ్యక్తం చేశాడు.
''విజయం పట్ల ఆనందంగా ఉంది. మంచు ప్రభావంతో ఏర్పడిన తడి పరిస్థితుల్లో 76 పరుగుల తేడాతో గెలవడం అద్భుత ప్రదర్శనే. టాస్ ఓడిపోవడం మాకు కలిసొచ్చింది. ఇక్కడ వాతావరణం చాలా వేడిగా ఉంది. గత మ్యాచ్లో 20 ఓవర్లు బ్యాటింగ్, ఫీల్డింగ్ చేశాం. ఇవాళ మ్యాచ్లో కూడా దాదాపు పూర్తి ఓవర్ల ఆట సాగింది. ఇక నా విషయానికొస్తే.. సెంచరీ గురించి అసలు ఆలోచించలేదు. 220 పరుగులు లేదా అంతకంటే ఎక్కువ స్కోరు చేయాలనుకున్నాం. కానీ కొన్ని షాట్లు మిస్ చేసినందుకు చాలా బాధ అనిపించింది''
''అది జట్టుపై ప్రభావం చూపిస్తుందేమో అని ఇన్నింగ్స్ బ్రేక్లో ఆలోచించా. కానీ అంతిమంగా మేం గెలిచాం. గత మ్యాచ్లో కొన్ని పొరపాట్లు చేశాం. ఫీల్డింగ్లో మార్క్ను చూపించలేకపోయాం. కానీ ఇవాళ పక్కా ప్రణాళికలతో వచ్చాం. అద్భుతంగా ఫీల్డింగ్ చేశాం. ఇంపాక్ట్ సబ్స్టిట్యూట్ రూల్ వల్ల ఓ స్కోరు సరిపోతుందని భావించలేని పరిస్థితి ఏర్పడింది. అదనంగా 15-20 పరుగులు చేయాల్సిందే''
''గత మ్యాచ్ల్లో మేం పవర్ప్లేలో వికెట్లు సాధించలేకపోయాం. ప్రత్యర్థిపై ఆదిలోనే పైచేయి సాధించాలంటే అదే ఉత్తమ మార్గం. తుషార్ దేశ్పాండే గొప్పగా బౌలింగ్ చేశాడు. అతడి కష్టానికి ప్రతిఫలం దక్కింది. జడేజా గురించి ప్రత్యేకంగా మాట్లాడాలి. తడి పరిస్థితుల్లో నాలుగు ఓవర్లలో 22 పరుగులే ఇచ్చాడు. నా దృష్టిలో అదే మ్యాచ్ టర్నింగ్ స్పెల్'' అని రుతురాజ్ పేర్కొన్నాడు.