30 పరుగులు తక్కువే చేశాం:
మ్యాచ్ అనంతరం సురేశ్ రైనా మాట్లాడుతూ... 'ఈ ఓటమి ఓ మేల్కొలుపు లాంటిది. మేం పెద్ద లక్ష్యాన్ని నిర్దేశించాల్సింది. వరుసగా వికెట్లు కోల్పోవడంతో భారీ పరుగులు సాధ్యం కాలేదు. మాకు డుప్లెసీస్, వాట్సన్లు మంచి ఆరంభం ఇచ్చారు. కానీ.. మేము దాన్ని సరిగా వినియోగించుకోలేకపోయాం. కీలకమైన సమయంలో వరుసగా వికెట్లు కోల్పోయాం.. అదే మ్యాచ్పై ప్రభావం చూపింది. స్ట్రైక్ రొటేట్ చేస్తూ పెద్ద భాగస్వామ్యాలు నెలకొల్పాల్సి ఉంది. అనుకున్న దానికంటే 30 పరుగులు తక్కువే చేశాం' అని రైనా తెలిపారు.
ధోనీ ఫిట్గా ఉన్నాడు:
'తాహిర్ కీలక సమయంలో వికెట్లు తీసి అద్భుతంగా బౌలింగ్ చేసాడు. జట్టులో సీనియర్ ఆటగాళ్లు ఉన్నారు.. కలిసికట్టుగా ఆడుతే విజయాలు వస్తాయి. ప్రస్తుతం ధోనీ ఫిట్గా ఉన్నాడు. గాయం నుంచి కోలుకున్నాడు. బెంగళూరుతో జరిగే మ్యాచ్లో అందుబాటులోకి వస్తాడు' అని రైనా చెప్పుకొచ్చారు.
చెన్నైపై హైదరాబాద్ విజయం:
ఉప్పల్ వేదికగా బుధవారం జరిగిన మ్యాచ్లో చెన్నై సూపర్కింగ్స్పై సన్రైజర్స్ హైదరాబాద్ 6 వికెట్ల తేడాతో గెలిచింది. తొలుత బ్యాటింగ్కు చేసిన చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 132 పరుగులు చేసింది. డుప్లెసిస్ (31 బంతుల్లో 45; 3 ఫోర్లు, 3 సిక్సర్లు), వాట్సన్ (29 బంతుల్లో 31; 4 ఫోర్లు)లు రాణించారు. అనంతరం లక్ష్య ఛేదనలో సన్రైజర్స్ 16.5 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 137 పరుగులు చేసి విజయం సాధించింది. వార్నర్ (25 బంతుల్లో 50; 10 ఫోర్లు), బెయిర్స్టో (44 బంతుల్లో 61 నాటౌట్; 3 ఫోర్లు, 3 సిక్స్లు) అర్ధ సెంచరీలు చేశారు.