
దుబాయ్: ఐపీఎల్ 2020లో సన్రైజర్స్ హైదరాబాద్ వరుసగా రెండో విజయం నమోదు చేసిన విషయం తెలిసిందే. శుక్రవారం వార్నర్ సేన 7 పరుగుల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్ను ఓడించింది. మొదట దీపక్ చహర్ (2/31), పీయూష్ చావ్లా (1/20) సన్రైజర్స్ను దెబ్బ తీసినా.. 20 ఏళ్ల ప్రియమ్ గార్గ్ (51 నాటౌట్; 26 బంతుల్లో 6×4, 1×6) సంచలన ఇన్నింగ్స్ ఆడటంతో ఆ జట్టు పుంజుకుని 5 వికెట్లకు 164 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనలో చెన్నై 5 వికెట్లకు 157 పరుగులకే పరిమితమైంది. రవీంద్ర జడేజా (50; 35 బంతుల్లో 5×4, 2×6), ఎంఎస్ ధోనీ (47 నాటౌట్; 36 బంతుల్లో 4×4, 1×6) పోరాడినా ఫలితం లేకపోయింది.
మ్యాచ్ అనంతరం చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ మీడియాతో మాట్లాడారు. బ్యాటింగ్ ఆర్డర్లో ఎంఎస్ ధోనీ దిగువన రావడంపై ప్రశ్నించిన విలేకరులపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది అసలు ప్రశ్నేనా, అంత ముఖ్యమైన ప్రశ్నా అని మండిపడ్డాడు. 'ఎంఎస్ ధోనీ కన్నా ముందుగా కేదార్ జాదవ్ను పంపించడంలో మీ ఆంతర్యం ఏంటి?' అని ఒక విలేకరి ఫ్లెమింగ్ను ప్రశ్నించారు. 'ఇప్పుడు నేను నిన్ను అడుగుతున్నాను. నిజంగానే ఇది అసలు ప్రశ్నేనా?, అది అంత ముఖ్యమైనదా' అని చిరాకుపడ్డాడు.
'మా బ్యాటింగ్ ఆర్డర్లో కేదార్ జాదవ్ది నాలుగో స్థానం. ప్రాథమికంగా ఎంఎస్ ధోనీ మిడిల్ నుంచి లోయర్ ఆర్డర్ ఆటగాడు. ఇక్కడ జాదవ్ రెండు పాత్రలు పోషిస్తాడు. ఒకవేళ టాప్ ఆర్డర్ రాణిస్తే.. జాదవ్ దిగువకు వచ్చి ధోనీ ముందుగా బ్యాటింగ్కు వస్తాడు. అదే త్వరగా వికెట్లు పడితే.. జాదవ్ నాలుగులో వచ్చి వికెట్లు పడకుండా అడ్డుకుంటాడు. ధోనీ దిగువన వస్తాడు. ఇక్కడితో నేను ఆపేస్తాను' అని విలేకరికి ఫ్లెమింగ్ వివరణ ఇచ్చాడు.
గతేడాది తృటిలో టైటిల్ చేజార్చుకున్న చెన్నై.. ఈ సారి భారీ అంచనాలతో బరిలోకి దిగింది. ముంబైతో తొలి మ్యాచులో ఘన విజయం సాధించిన చెన్నై.. ఆ తర్వాత వరుసగా మూడు మ్యాచుల్లో ఓటమి పాలైంది. 2014 తర్వాత ధోనీసేన ఇలా ఓడిపోవడం ఇదే తొలిసారి. మరీ ముఖ్యంగా మహీ ఆటతీరు, సారథ్యం ఉసూరుమనిపిస్తోంది. అన్నీ చూసుకొనే సురేష్ రైనా లేడు. సీనియర్ల ఫిట్నెస్పై సందేహాలు నెలకొన్నాయి. ఫీల్డింగ్ చాలా దారుణంగా ఉంటోంది. ఇక బౌలింగ్లో పస కనిపించడం లేదు. మరోవైపు ఆటగాళ్లు గాయాలపాలవుతున్నారు. అంతకుమించి ధోనీయే ఆత్మవిశ్వాసంతో లేకపోవడం కలవరపెడుతోంది. సరైన సన్నద్ధత లేకపోవడంతో తన కన్నా ముందుగా దిగువ ఆర్డర్ ఆటగాళ్లను పంపిస్తున్నాడు.