వరలక్ష్మికి పంచ్:
చెన్నై, హైదరాబాద్ మ్యాచ్ మొదలవడానికి 5 నిమిషాల ముందు కోలీవుడ్ స్టార్ హీరోయిన్ వరలక్ష్మి శరత్కుమార్ ఓ పోస్ట్ చేశారు. చెన్నైకి వరలక్ష్మి పెద్ద ఫ్యాన్ అన్న విషయం తెలిసిందే. 'నేను గాల్లో తెలియాడుతున్నాను. ఈ రోజు రాత్రి మా సింహాలు (చెన్నై ఆటగాళ్లు) గర్జిస్తాయి. ఇది మా రాత్రి' అని వరలక్ష్మి ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ చూసిన టాలీవుడ్ యువ హీరో అడవి శేష్.. వరలక్ష్మికి సరదాగా ఓ పంచ్ ఇచ్చాడు. 'ఆరేంజ్ ఆర్మీ (సన్రైజర్స్) బరిలోకి దిగనంతవరకే మీ ఆటలు' అని ట్వీట్ చేశాడు. దీనికి వరలక్ష్మి రిప్లై ఇచ్చారు. 'చూద్దాం.. ఎవఋ గెలుస్తారో' అని ట్వీటారు.

ఈ సంవత్సరం చెన్నైది కాదు:
చెన్నై సూపర్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్ 7 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో వరలక్ష్మితో అడవి శేష్ అన్న మాటే నిజమైంది. వరలక్ష్మి ట్వీట్పై సన్రైజర్స్ అభిమానులు కూడా స్పందిస్తున్నారు. 'ఈ సంవత్సరం చెన్నైది కాదు' అని ఒకరు ట్వీట్ చేయగా.. 'సన్రైజర్స్ సునాయాస విజయం ఇది' అని మరొకరు ట్వీటారు. 'ఆకలిగా ఉంది కానీ నాకు సాంబార్ నచ్చదు .. బిర్యానీ అంటే చాలా ఇష్టం' అని ఒకరు ఫన్నీగా ట్వీట్ చేశాడు. ఇంకొందరు అయితే వరలక్ష్మి మీమ్స్ పోస్ట్ చేస్తున్నారు. అడవి శేష్ చేసిన ట్వీట్ నెట్టింట వైరల్ అయింది.

గార్గ్ సంచలన ఇన్నింగ్స్:
గత రాత్రి వార్నర్ సేన 7 పరుగుల తేడాతో చెన్నై సూపర్కింగ్స్ను ఓడించింది. మొదట దీపక్ చహర్ (2/31), పీయూష్ చావ్లా (1/20) సన్రైజర్స్ను దెబ్బ తీసినా.. 20 ఏళ్ల ప్రియమ్ గార్గ్ (51 నాటౌట్; 26 బంతుల్లో 6×4, 1×6) సంచలన ఇన్నింగ్స్ ఆడటంతో ఆ జట్టు పుంజుకుని 5 వికెట్లకు 164 పరుగులు చేసింది. అనంతరం చెన్నై 5 వికెట్లకు 157 పరుగులకే పరిమితమైంది. రవీంద్ర జడేజా (50; 35 బంతుల్లో 5×4, 2×6), ఎంఎస్ ధోనీ (47 నాటౌట్; 36 బంతుల్లో 4×4, 1×6) పోరాడినా ఫలితం లేకపోయింది. గార్గ్కే 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' అవార్డు దక్కింది.

పాయింట్ల పట్టికలో నాలుగో స్థానం:
తాజా విజయంతో ఐపీఎల్ 2020లో సన్రైజర్స్ హైదరాబాద్ తొలిసారి పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి చేరుకుంది. చెన్నైపై విజయానికి ముందు ఏడో స్థానంలో ఉన్న సన్రైజర్స్ .. ధోనీ సేనపై విజయంతో నాలుగు పాయింట్లతో 4వ స్థానానికి చేరుకుంది. ఇక నాలుగు మ్యాచ్ల్లో ఒకే విజయంతో చెన్నై చివరి స్థానంలో కొనసాగుతోంది. ఈరోజు మధ్యాహ్నం 3.30 గంటలకు.. బెంగళూరు, రాజస్థాన్ మ్యాచ్.. రాత్రి 7.30 గంటలకు ఢిల్లీ క్యాపిటల్స్, కోల్కతా మధ్య మ్యాచ్ మొదలు కానుంది. బెంగళూరు, రాజస్థాన్ మ్యాచ్లో గెలిచిన జట్టు పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంటుంది. దీంతో సన్రైజర్స్ టాప్ 4 దిగువకు పడిపోతుంది.


Click it and Unblock the Notifications












