Riyan Parag: ఐపీఎల్ 2025లో భాగంగా ఆదివారం(మార్చి 30) గువాహతి వేదికగా జరిగిన మ్యాచులో చెన్నై సూపర్ కింగ్స్ పై గెలిచి ఈ సీజన్ లో రాజస్థాన్ రాయల్స్ బోణీ కొట్టింది. ఆరు పరుగుల తేడాతో సీఎస్కేపై గెలుపొందింది. అయితే సంజూ శాంసన్ గాయంతో ఇబ్బంది పడుతుండటం వల్ల.. రాజస్థాన్ రాయల్స్ జట్టుకు కెప్టెన్ గా యంగ్ ప్లేయర్ రియాన్ పరాగ్ కొనసాగుతున్నాడు.
కానీ రియాన్ పరాగ్ కెప్టెన్సీలో ఆడిన ఈ సీజన్ తొలి రెండు మ్యాచుల్లో (సన్రైజర్స్, కోల్కత్తా) రాజస్థాన్ రాయల్స్ గెలవలేదు. ఇప్పుడు ఎట్టకేలకు మూడో (సీఎస్కే) మ్యాచులో గెలిచింది. పైగా కెప్టెన్ గా అతడికిదే చివరి మ్యాచ్ కావడం వల్ల.. ఈ మ్యాచులో గెలుపు కోసం చాలా కష్టపడ్డాడు పరాగ్. ఫీల్డింగ్, బ్యాటింగ్ సమయాల్లో అద్భుతంగా రాణించాడు. తద్వారా మ్యాచ్ విజయంలో కీలకంగా వ్యవహరించాడు. దీంతో మ్యాచ్ విజయం తర్వాత రియాన్ పరాగ్ దండం పెట్టి రిలాక్స్ అవ్వడం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అలానే తన అభిమాన క్రికెటర్ ధోనీ ప్రాతినిధ్యం వహిస్తోన్న సీఎస్కేను రియాన్ పరాగ్ ఓడించడం కూడా ఇక్కడ విశేషం.

దీంతో ధోనితో కలిసి రియాన్ పరాగ్ చిన్నప్పుడు కలిగి దిగిన ఫొటో కూడా ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ గా మారింది. తన ఆరాధ్య క్రికెటర్ తో పోటీపడి సీఎస్కేను ఓడించడంతో క్రికెట్ అభిమానులు అతడిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇంతకన్నా పెద్ద సక్సెస్ ఏముంటుందని.. కామెంట్లు చేస్తున్నారు.
కాగా, ఈ విజయంతో రాజస్థాన్ రాయల్స్ జట్టు పాయింట్లు పట్టికలో పదో స్థానం నుంచి తొమ్మిదో స్థానానికి చేరుకుంది. మొదట టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 182 పరుగులు చేసింది. కానీ ఆ లక్ష్యాన్ని సీఎస్కే ఛేదించలేకపోయింది.