స్లో పిచ్పై రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్లు పరుగులు చేయడానికి చెమటోడ్చారు. చెపాక్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్తో జరుగుతున్న మ్యాచ్లో రాజస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో అయిదు వికెట్లు కోల్పోయి 141 పరుగులు చేసింది. రియాన్ పరాగ్ (47*; 35 బంతుల్లో, 1x4, 3x6), ధ్రువ్ జురెల్ (28; 18 బంతుల్లో, 1x4, 2x6) రాణించారు. సీఎస్కే బౌలర్లలో సిమర్జీత్ సింగ్ (3/26) మూడు, తుషార్ దేశ్పాండే (2/30) రెండు వికెట్లతో సత్తాచాటారు.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రాజస్థాన్ రాయల్స్ నిలకడగా ఇన్నింగ్స్ ఆరంభించింది. బ్యాటింగ్కు గొప్పగా అనుకూలించిన ఈ పిచ్పై ఓపెనర్లు యశస్వీ జైస్వాల్ (24; 21 బంతుల్లో, 3x4, 1x6), బట్లర్ (21; 25 బంతుల్లో, 2x4) జాగ్రత్తగా ఆడారు. తొలుత బంతికో పరుగు చేయడానికి శ్రమించిన జైస్వాల్ క్రమంగా పుంజుకున్నాడు. తీక్షణ వేసిన నాలుగో ఓవర్లో సిక్సర్, బౌండరీ బాదాడు.

శార్దూల్ ఠాకూర్ వేసిన తర్వాతి ఓవర్లో వరుసగా రెండు ఫోర్లు సాధించాడు. దీంతో రాజస్థాన్ పవర్ప్లేలో 42/0 స్కోరు సాధించింది. అయితే కాసేపటికే ఓపెనర్లు ఇద్దరినీ సిమర్జీత్ పెవిలియన్కు చేర్చి ఆర్ఆర్ను దెబ్బకొట్టాడు. తన వరుస ఓవర్లలో జైస్వాల్, బట్లర్ను ఔట్ చేశాడు. ఈ దశలో బ్యాటింగ్కు వచ్చిన రియాన్ పరాగ్తో కలిసి సంజు శాంసన్ (15; 19 బంతుల్లో) ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేశాడు.
పరాగ్ సంయమనంతో ఆడుతున్నప్పటికీ, శాంసన్ జాగ్రత్తగా ఆడటంతో రన్రేట్ క్రమంగా తగ్గింది. 14 ఓవర్లకు రాజస్థాన్ 89/2 స్కోరుతో నిలిచింది. అయితే రాజస్థాన్ను సిమర్జిత్ మరోసారి దెబ్బకొట్టాడు. గేర్ మార్చ్ దూకుడుగా ఆడాలనుకున్న శాంసన్ను బోల్తా కొట్టించాడు. ఈ మ్యాచ్లో శాంసన్ ఒక్క బౌండరీ కూడా సాధించకపోవడం గమనార్హం. కాగా, అనంతరం బ్యాటింగ్కు వచ్చిన ధ్రువ్ జురెల్తో కలిసి రియాన్ ఆఖర్లో దూకుడుగా ఆడటంతో చెన్నైకి రాజస్థాన్ పోరాడే లక్ష్యాన్ని నిర్దేశించింది.