ఐపీఎల్-2024లో మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది. చెపాక్ వేదికగా రాజస్థాన్ రాయల్స్తో చెన్నై సూపర్ కింగ్స్ తలపడనుంది. ప్లేఆఫ్స్ బెర్త్ ఖరారు చేసుకోవడం కోసం రాజస్థాన్, తదుపరి దశకు చేరుకోవడానికి అవకాశాలు మెరుగుపర్చుకోవడం కోసం సీఎస్కే పట్టుదలతో బరిలోకి దిగుతున్నాయి. 11 మ్యాచ్లు ఆడిన ఆర్ఆర్ ఎనిమిదింట్లో గెలిచి 16 పాయింట్లతో పట్టికలో రెండో స్థానంలో ఉంది.
మరోవైపు 12 మ్యాచ్లు ఆడిన చెన్నై ఆరింట్లో గెలిచి 12 పాయింట్లతో నాలుగో స్థానంలో కొనసాగుతోంది. కాగా, ఐపీఎల్లో ఇరు జట్లు 28 మ్యాచ్లు ఆడగా, సీఎస్కే 15 మ్యాచ్ల్లో గెలిచి పైచేయి సాధించింది. రాజస్థాన్ 13 పోరుల్లో విజయం సాధించింది. అయితే గత నాలుగు మ్యాచ్ల్లో చెన్నైపై ఆర్ఆర్దే పైచేయి.

పిచ్ ఎలా ఉంది?
మధ్యాహ్నం మ్యాచ్ కావడంతో చెన్నైలో ఉష్ణోగ్రత సుమారు 37 డిగ్రీ సెల్సియస్కు పైగా ఉంది. ఆటగాళ్లు వేడికి తట్టుకోవడమే అసలైన సవాలు. కాగా, ఇవాళ మ్యాచ్లో చెపాక్లోని ఆరో నంబర్ పిచ్ను ఉపయోగిస్తున్నారు. ఇక్కడ సగటు స్కోరు 183. ఈ వికెట్పై ఆడిన గత రెండు మ్యాచ్ల్లో తొలుత బ్యాటింగ్ చేసిన దాదాపు 200 స్కోరు చేసింది. అయితే అవి రాత్రి జరిగిన మ్యాచ్లు.
టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ బ్యాటింగ్ ఎంచుకుంది. అనంతరం రాజస్థాన్ కెప్టెన్ శాంసన్ మాట్లాడుతూ.. 'వికెట్ బ్యాటింగ్ అనుకూలంగా ఉందనిపిస్తోంది. డే మ్యాచ్ కావడంతో మంచు ప్రభావం చూపదు. పిచ్ ఎలా మారుతుందో చూద్దాం. గత మ్యాచ్కు దూరమైన ధ్రువ్ జురెల్ తిరిగొచ్చాడు'' అని తెలిపాడు. టాస్ అనంతరం సీఎస్కే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ కూడా మాట్లాడాడు. రచిన్తో కలిసి ఇన్నింగ్స్ ప్రారంభిస్తానని, డారిల్ మిచెల్ వన్డౌన్లో వస్తాడని చెప్పాడు. దీంతో అజింక్య రహానె జట్టులో చోటు కోల్పోయాడని వివరించాడు.
''ఇవాళ మ్యాచ్లో మంచు ప్రభావం చూపదు కాబట్టి బ్యాటింగ్, బౌలింగ్లో ఏది ముందు అయినా ఫర్వాలేదు. మ్యాచ్ ఆద్యంతం పిచ్ ఒకేలా స్పందిస్తుందనిపిస్తోంది. మెరుగవ్వాల్సి విభాగాల గురించి మాట్లాడుకున్నాం. రచిన్తో కలిసి ఇన్నింగ్స్ ప్రారంభిస్తా. మూడో స్థానంలో డారిల్ మిచెల్ బ్యాటింగ్కు వస్తాడు. అలాగే శాంట్నర్ స్థానంలో జట్టులోకి తీక్షణ వచ్చాడు'' అని రుతురాజ్ పేర్కొన్నాడు.
తుది జట్టు
రాజస్థాన్ రాయల్స్: యశస్వీ జైస్వాల్, బట్లర్, సంజు శాంసన్ (కెప్టెన్), రియాన్ పరాగ్, శుభమ్ దూబె, ధ్రువ్ జురెల్, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, అవేశ్ ఖాన్, సందీప్ శర్మ, చాహల్
చెన్నై సూపర్ కింగ్స్: రచిన్ రవీంద్ర, రుతురాజ్ (కెప్టెన్), డారిల్ మిచెల్, మొయిన్ అలీ, శివమ్ దూబె, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోనీ, శార్దూల్ ఠాకూర్, తుషార్ దేశ్పాండే, సిమర్జీత్ సింగ్, తీక్షణ.