ఐపీఎల్ 2025లో చెన్నై సూపర్ కింగ్స్ వరుస ఓటములును అందుకుంటోంది. మొన్న ఆర్సీబీపై ఏకంగా 50 పరుగుల తేడాతో ఓడిన ఆ జట్టు.. ఇప్పుడు రాజస్థాన్ రాయల్స్ పై 6 పరుగులు తేడాతో పరాజయాన్ని అందుకుంది. అయితే గుహావతి వేదికగా జరిగిన మ్యాచులో రాజస్థాన్ రాయల్స్ ఫీల్డింగ్ చేసిన విధానాన్ని పలువురు మాజీ క్రికెటర్లు, అభిమానులు ప్రశంసిస్తున్నారు. ఈ మ్యాచులో ఇరు జట్ల ఫీల్డింగ్ ప్రదర్శనను పోలుస్తూ, అందులో ఉన్న తేడాని గుర్తించి తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.
చాలా బాధాకరం..
ఈ క్రమంలోనే సీఎస్కే మాజీ క్రికెటర్ అంబటి రాయుడు కూడా సీఎస్కే వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ లో ఫీల్డింగ్ ఎలాంటి పాత్ర పోషించిందో వివరించాడు. రాజస్థాన్ రాయల్స్ చేసిన కచ్చితత్వమైన ఫీల్డింగే వారి విజయానికి కారణమయ్యాయని తెలిపాడు. "చెన్నై సూపర్ కింగ్స్ ఫీల్డింగ్లో మెరుగైన జట్టుగా గుర్తింపు పొందలేదు. ఒకవేళ గతంలో కొన్ని సీజన్లలో వాళ్లు బాగానే రాణించినా, ఈ సీజన్లో మాత్రం వారి ప్రదర్శన ఆకట్టుకోలేదు. పేలవ ప్రదర్శన చేశారు. తొలి రెండు మ్యాచ్లలోనే సీఎస్కే ఆటగాళ్లు సులభమైన క్యాచ్లను విడిచిపెట్టడం, అవుట్ఫీల్డులో తడబడటం వంటి తప్పిదాలు చేశారు. వాటిని గుర్తించి సరిచేసుకోవాలి. వీటిని త్వరగా సరిచేసుకోకపోతే, జట్టుకు పెద్ద నష్టం కలుగుతుంది. సీఎస్కే చేసిన కొన్ని పొరపాట్లు, తప్పిదాలు చూస్తుంటే, నిజంగానే చాలా బాధకరంగా అనిపించాయి," అని సీఎస్కే ఓటమి తర్వాత అంబటి రాయుడు వ్యాఖ్యానించాడు.

అవి అరుదుగా చూస్తుంటాం...
"ఒక మ్యాచ్ గట్టిపోటీకరంగా మారినప్పుడు, చిన్న చిన్న విషయాలు కూడా ఫలితాన్ని ప్రభావితం చేస్తాయి. ఈ మ్యాచ్లో కొన్ని అద్భుతమైన, అసాధారణమైన క్యాచ్లు చూశాం. సాధారణంగా ఇటువంటి క్యాచ్లు అరుదుగా చూస్తాం! అయితే, చెన్నై సూపర్ కింగ్స్ మాత్రం ఫీల్డింగ్లో చేతులెత్తేసింది. ఒకటి లేదా రెండు క్యాచులు తప్ప, వారి ఫీల్డింగ్లో పెద్దగా ప్రభావం లేదని స్పష్టంగా కనిపించింది. అదే రాజస్థాన్ రాయల్స్ అద్భుతంగా ఆడింది. ఫీల్డింగ్ అనేది కేవలం యువ జట్టును కలిగి ఉండటం వల్లే బాగా రాణించగలమని అనుకోవడం తప్పు. అది ముందుగా అంచనా వేసి, ఫీల్డ్ లో అప్రమత్తంగా ఉండటంపై ఆధారపడి ఉంటుంది. శివమ్ దూబే భారీ షాట్లు కొడుతూ డేంజర్గా మారుతున్న సమయంలో రియాన్ పరాగ్ అందుకున్న క్యాచ్, మ్యాచ్లో కీలక మలుపుగా మారింది," అని రాయుడు విశ్లేషించాడు.