చెపాక్ వేదికగా రాజస్థాన్ రాయల్స్తో జరిగిన మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ అయిదు వికెట్ల తేడాతో నెగ్గింది. ఈ విజయంతో ప్లేఆఫ్స్ అవకాశాలను మెరుగుపర్చుకుంది. పాయింట్ల పట్టకలో సన్రైజర్స్ హైదరాబాద్ను వెనక్కినెట్టి మూడో స్థానానికి ఎగబాకింది. 13 మ్యాచ్లు ఆడిన సీఎస్కే ఏడు విజయాలతో 14 పాయింట్లు సాధించింది.
స్లో పిచ్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో అయిదు వికెట్లు కోల్పోయి 141 పరుగులు చేసింది. రియాన్ పరాగ్ (47*; 35 బంతుల్లో, 1x4, 3x6), ధ్రువ్ జురెల్ (28; 18 బంతుల్లో, 1x4, 2x6) రాణించారు. యశస్వీ జైస్వాల్ (24; 21 బంతుల్లో, 3x4, 1x6), బట్లర్ (21; 25 బంతుల్లో, 2x4) పరుగులు చేశారు. సీఎస్కే బౌలర్లలో సిమర్జీత్ సింగ్ (3/26) మూడు, తుషార్ దేశ్పాండే (2/30) రెండు వికెట్లతో సత్తాచాటారు.

అనంతరం ఛేదనకు దిగిన చెన్నై సూపర్ కింగ్స్ 18.2 ఓవర్లలో అయిదు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. రచిన్ రవీంద్ర (27; 18 బంతుల్లో, 1x4, 2x6), డారిల్ మిచెల్ (22; 13 బంతుల్లో, 4x4), శివమ్ దూబె (18; 11 బంతుల్లో, 2x4, 1x6) దూకుడుగా ఆడారు. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ (42*; 41 బంతుల్లో, 1x4, 2x6) ఆఖరి వరకు క్రీజులో ఉండి జట్టును గెలిపించాడు. రాజస్థాన్ బౌలర్లలో అశ్విన్ రెండు, బర్గర్, చాహల్ చెరో వికెట్ తీశారు.
స్లో పిచ్పై సీఎస్కే ఛేజింగ్ను దూకుడుగా ఆరంభించింది. రుతురాజ్ జాగత్రగా ఆడగా, మరో ఓపెనర్ రచిన్ టాప్ గేర్లో దూసుకెళ్లాడు. బౌల్ట్ వేసిన ఓవర్లో వరుసగా బౌండరీ, సిక్సర్ బాదాడు. అయితే రచిన్ ఎక్కువసేపు క్రీజులో నిలవలేదు. నాలుగో ఓవర్ వేసిన అశ్విన్ బౌలింగ్లో రిటర్న్ క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. వన్డౌన్లో వచ్చిన డారిల్ మిచెల్ కూడా వేగంగా పరుగులు సాధించడంతో పవర్ప్లేలో చెన్నై 56/1 స్కోరు సాధించింది.
సీఎస్కే దూకుడుకు చాహల్ బ్రేక్లు వేశాడు. ఏడో ఓవర్లో ఒకే పరుగు ఇచ్చి మిచెల్ను ఔట్ చేశాడు. అవేశ్ ఖాన్, అశ్విన్ కూడా పొదుపుగా బౌలింగ్ చేయడంలో చెన్నై 10 ఓవర్లకు 77/2 స్కోరుతో నిలిచింది. కాసేపటికే మొయిన్ అలీ కూడా ఔటవ్వడంతో మ్యాచ్ పోటాపోటీగా మారింది. కానీ దూబె తన విధ్వంసకర బ్యాటింగ్తో మ్యాచ్ను తిరిగి సీఎస్కే వైపు తిప్పాడు. అశ్విన్ బౌలింగ్లో రెండు ఫోర్లు, ఓ సిక్సర్ బాది అదే ఓవర్లో ఔటయ్యాడు.
అనంతరం క్రీజులోకి వచ్చిన జడేజా (5; 7 బంతుల్లో) కూడా ఎక్కువ సేపు నిలవలేదు. అబ్స్ట్రక్టింగ్ ది ఫీల్డ్ కారణంగా జడ్డూ ఔటయ్యాడు. దీంతో మ్యాచ్ ఆసక్తికరంగా మారింది. కానీ సమీర్ రిజ్వీ (15; 8 బంతుల్లో, 3x4)తో కలిసి రుతురాజ్ మరో పొరపాటు చేయకుండా జట్టును విజయతీరాలకు చేర్చాడు.