
షార్జా: ఐపీఎల్ 13వ సీజన్లో మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది. మరికొద్దిసేపట్లో జరిగే మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్ అమీతుమీ తేల్చుకోనున్నాయి. టాస్ గెలిచిన చెన్నై కెప్టెన్ ఎంఎస్ ధోనీ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. చెన్నై ఒక మార్పుతో బరిలోకి దిగుతోంది. అంబటి రాయుడు 100% ఫిట్గా లేడని మహీ చెప్పాడు. అతని స్థానంలో రుతురాజ్ గైక్వాడ్ జట్టులోకి వచ్చాడు. మరోవైపు రాజస్థాన్ తరఫున స్టీవ్ స్మిత్ బరిలోకి దిగుతున్నాడు. టామ్ కరన్ కూడా జట్టులో చోటు దక్కించుకున్నాడు.
విజయంతోనే ఐపీఎల్ 2020 జర్నీని ప్రారంభించాలనిరాజస్థాన్ రాయల్స్ భావిస్తుండగా.. గత మ్యాచ్ ఫలితాన్నే రిపీట్ చేయాలని చెన్నై సూపర్ కింగ్స్ ఉవ్విళ్లూరుతోంది. పేపర్పై ఇరు జట్లు సమతూకంగా కనిపిస్తున్నా.. చెన్నై జట్టే హాట్ ఫేవరేట్గా బరిలోకి దిగుతుంది. ఐపీఎల్ చరిత్రలో ఇరు జట్లు ఇప్పటి వరకు 21 సార్లు తలపడగా 14-7తో చెన్నై సూపర్ కింగ్స్ లీడ్లో ఉంది. అదే ఆధిపత్యాన్ని కొనసాగించాలని ధోనీసేన భావిస్తోంది. మరీ ఏ జట్టును విజయం వరిస్తుందో చూడాలి.
షార్జా క్రికెట్ స్టేడియంలో చిన్న బౌండరీలు కావడంతో భారీ స్కోర్కు అవకాశం ఉంది. బ్యాటింగ్ ఫ్రెండ్లీ పిచ్. పరుగుల వరద పారే అవకాశం ఉంది. ఇక సెకండ్ ఇన్నింగ్స్లో తేమ ప్రభావం ఉంటుంది కాబట్టి ఫీల్డింగ్, బౌలింగ్ చేయడం కష్టం అవుతుంది. గత మూడు మ్యాచ్ల్లో కూడా టాస్ గెలిచిన జట్టు ఫీల్డింగ్ ఎంచుకున్నాయి. అయితే చెన్నై మినహా మిగతా రెండు జట్లు ఓటమిపాలయ్యాయి. 7.30కు మ్యాచ్ ప్రారంభం కానుండగా.. స్టార్ స్పోర్ట్స్ చానెళ్లలో ప్రత్యక్ష ప్రసారం కానుంది.
తుది జట్లు:
చెనై సూపర్ కింగ్స్: షేన్ వాట్సన్, మురళీ విజయ్, ఫాఫ్ డూప్లెసిస్, రుతురాజ్ గైక్వాడ్, ఎంఎస్ ధోనీ(కెప్టెన్, కీపర్), కేదార్ జాదవ్, రవీంద్ర జడేజా, పియూష్ చావ్లా, దీపక్ చాహర్, లుంగి ఎంగిడి, సామ్ కరన్.
రాజస్థాన్ రాయల్స్: రాబిన్ ఊతప్ప, యశస్వీ జైస్వాల్, సంజూ శాంసన్, స్టీవ్ స్మిత్, డేవిడ్ మిల్లర్, రియాన్ పరాగ్, శ్రేయస్ గోపాల్, జోఫ్రా ఆర్చర్, జయదేశ్ ఉనాద్కట్, రాహుల్ తేవాటియా, టామ్ కరన్.