
షార్జా: టీమిండియా కెప్టెన్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) సారథి విరాట్ కోహ్లీ గతకొంత కాలంగా పరుగులు చేయడంలో ఇబ్బందిపడుతున్న విషయం తెలిసిందే. ఇటీవల ఇంగ్లండ్ పర్యటనలో నిరాశపరిచిన కోహ్లీ.. ఐపీఎల్ రెండో దశలో కోల్కతాపై కూడా నిరాశపరిచాడు. నాలుగు బంతుల్లో ఒక బౌండరీ బాది కేవలం 5 పరుగులు మాత్రమే చేశాడు. అయితే శుక్రవారం చెన్నై సూపర్ కింగ్స్తో జరిగిన మ్యాచులో ఆర్సీబీ కెప్టెన్ మళ్లీ టచ్లోకి వచ్చాడు. హాఫ్ సెంచరీతో సత్తాచాటాడు. దీంతో పాత కోహ్లీని మరోసారి అభిమానులకు గుర్తుచేశాడు.
చెన్నై సూపర్ కింగ్స్తో జరిగిన మ్యాచులో ఆర్సీబీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఓ భారీ సిక్స్ కొట్టాడు. ఇన్నింగ్స్ ఐదో ఓవర్ వేసిన శార్దూల్ ఠాకూర్ బౌలింగ్లో కోహ్లీ భారీ సిక్స్ బాదాడు. ఐదవ ఓవర్ నాలుగో బంతిని శార్దూల్ స్లో బంతిగా వేయగా.. లాంగ్ ఆన్ మీదుగా కోహ్లీ భారీ షాట్ ఆడాడు. బంతి కాస్త షార్జా స్టేడియం బయట పడింది. ఆ సిక్సర్ 82 మీటర్ల దూరం వెళ్లింది. షాట్ ఆడిన అనంతరం విరాట్ బంతి వైపే కాసేపు చూడలేదు. బ్యాట్ నుంచి వచ్చిన ఆ సౌండ్ వింటే తెలిసిపోతుంది.. ఇక ఆ బంతి ఎక్కడికి వెళ్తుందో చూడాల్సిన అవసరం లేదని కామెంటేటర్ సైమన్ డల్ అన్నాడు. ఇక మైదానంలో ఫాన్స్ అరుపులు, కేకలు వేశారు. కొందరైతే డాన్సులు కూడా చేసి తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు.
అయితే చెన్నైతో మ్యాచ్లో విరాట్ కోహ్లీ మళ్లీ ఫామ్లోకి వచ్చినట్లు కనిపించినా.. ఆ మ్యాచ్ను బెంగుళూరు ఓడిపోయింది. ఏదేమైనా కోహ్లీ కొట్టిన సిక్సర్ మాత్రం నెట్టింట వైరల్ అయింది. ఫాన్స్ తమదైన శైలిలో కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఇక ఈ మ్యాచులో కోహ్లీ కళ్లు చెదిరే క్యాచ్తో ఔరా అనిపించాడు. ఆర్సీబీ బౌలర్ల సహనానికి పరీక్షగా నిలిచిన చెన్నై స్టార్ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ను తన మైమరిపించే ఫీల్డింగ్ విన్యాసంతో పెవిలియన్ చేర్చాడు. అచ్చం చేప పిల్ల తరహాలో డైవ్ చేసి బంతిని అందుకున్నాడు. చహల్ వేసిన ఫ్లైట్ అండ్ టర్న్ బాల్ను రుతురాజ్ కవర్ డ్రైవ్ ఆడే ప్రయత్నం చేయగా బ్యాట్ ఎడ్జ్ తాకిన బంతి గాల్లోకి లేసింది. ఇక బ్యాక్ వర్డ్ పాయింట్లో ఫీల్డింగ్ చేస్తున్న కోహ్లీ కళ్లు చెదిరే ఫార్వర్డ్ డైవ్తో బంతిని అద్భుతంగా అందుకున్నాడు.
బెంగళూరు ఇన్నింగ్స్ ఆరంభమైన తీరుకు.. ముగిసిన విధానానికి పొంతనే లేదు. ఒక దశలో 111/0తో ఉన్న బెంగళూరు చివరికి 156/6తో ఇన్నింగ్స్ను ముగించింది. దేవదత్ పడిక్కల్ (70; 50 బంతుల్లో 5×4, 3×6), విరాట్ కోహ్లీ (53; 41 బంతుల్లో 6×4, 1×6) దూకుడుగా ఆడటంతో పవర్ ప్లే ఆఖరికి బెంగళూరు 55/0తో నిలిచింది. ఇద్దరూ హాఫ్ సెంచరీలు పూర్తి చేసుకుని భాగస్వామ్యాన్ని 100 దాటించారు. అయితే డ్వేన్ బ్రావో బౌలింగ్లో కోహ్లీ ఔటవడంతో 111 పరుగుల వద్ద తొలి వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. శార్దూల్ ఠాకూర్ (2/29) మధ్యలో బెంగళూరును గట్టి దెబ్బ కొట్టాడు. తొలి 10 ఓవర్లలో వికెట్ కోల్పోకుండా 90 పరుగులు చేసిన కోహ్లీసేన.. చివరి 10 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 66 పరుగులే చేయగలిగింది.