కోహ్లీ ఔటవడంతో:
బెంగళూరు ఇన్నింగ్స్ ఆరంభమైన తీరుకు.. ముగిసిన విధానానికి పొంతనే లేదు. ఒక దశలో 111/0తో ఉన్న బెంగళూరు చివరికి 156/6తో ఇన్నింగ్స్ను ముగించింది. విరాట్ కోహ్లీ, దేవదత్ పడిక్కల్ దూకుడుగా ఆడటంతో పవర్ ప్లే ఆఖరికి బెంగళూరు 55/0తో నిలిచింది. ఇద్దరూ హాఫ్ సెంచరీలు పూర్తి చేసుకుని భాగస్వామ్యాన్ని 100 దాటించారు. అయితే డ్వేన్ బ్రావో బౌలింగ్లో కోహ్లీ ఔటవడంతో 111 పరుగుల వద్ద తొలి వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. శార్దూల్ ఠాకూర్ (2/29) మధ్యలో బెంగళూరును గట్టి దెబ్బ కొట్టాడు. ఇక హిట్టర్ గ్లెన్ మ్యాక్స్వెల్ (11; 9 బంతుల్లో)తో సహా హర్షల్ పటేల్ (3)ను బ్రావో ఔట్ చేశాడు. తొలి 10 ఓవర్లలో వికెట్ కోల్పోకుండా 90 పరుగులు చేసిన కోహ్లీసేన.. చివరి 10 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 66 పరుగులే చేయగలిగింది.
వేర్వేరు బంతులు వేయమని చెప్పా:
డ్వేన్ బ్రావో చివరలో బంతిని అందుకున్నా.. బెంగళూరును గట్టి దెబ్బ కొట్టాడు. కీలక వికెట్లతో పాటు తన కోటా నాలుగు ఓవర్లలో 24 పరుగులు మాత్రమే ఇచ్చాడు. మ్యాచ్ అనంతరం చెన్నై కెప్టెన్ ఎంఎస్ ధోనీ మాట్లాడుతూ బ్రావోపై ప్రశంసల వర్షం కురిపించాడు. 'బ్రావో ఫిట్గా ఉన్నాడు. స్లో బంతులను బాగా వేయగలడు. నేను ఎప్పుడూ అతనిని బ్రో (సోదరుడు) అని పిలుస్తాను. స్లో బంతులు వేయాలా వద్దా అనే విషయంలో మాకు ఎప్పుడూ తగాదాలు ఉంటాయి. బ్రావో స్లో బంతులు వేస్తాడని అందరికీ తెలుసు. కాబట్టి ఒక ఓవర్లో ఆరు వేర్వేరు బంతులు వేయమని చెప్పాను' అని ధోనీ తెలిపాడు. బ్రావో 14వ ఓవర్లో బంతిని అందుకున్నాడు.
మనసు మార్చుకున్నా:
'అయితే ముందుగా డ్వేన్ బ్రావోతో ఆ ఓవర్ బౌలింగ్ చేయించాలని అనుకోలేదు. గత సీజన్లో బెంగళూరు గొప్ప ఆరంభాన్ని పొందింది. మేము మంచు గురించి ఆందోళన చెందాం. ఎనిమిదవ లేదా తొమ్మిదవ ఓవర్ తర్వాత పిచ్ కొంచెం నెమ్మదించింది. దేవదత్ పడిక్కల్ బ్యాటింగ్ చేస్తున్న తీరుతో రవీంద్ర జడేజా స్పెల్ చాలా కీలకం అయింది. డ్రింక్స్ సమయంలో మొయీన్ అలీతో మాట్లాడాను. జడేజాతో పాటు నువ్ మరో ఎండ్లో బౌలింగ్ చేయాల్సి ఉంటుందని చెప్పా. వెంటనే మనసు మార్చుకున్నాను. డ్వేన్ బ్రావోతో బౌలింగ్ చేయించాలని నిర్ణయించుకున్నాను. ఎందుకంటే అప్పటికే అతడికి బంతిని ఇవ్వడం ఆలస్యం అయింది. అతను వరుసగా నాలుగు ఓవర్లు బౌల్ చేయాల్సి ఉంటుంది' అని ఎంఎస్ ధోనీ పేర్కొన్నాడు.
కోహ్లీ ఈజీగా బుట్టలో పడ్డాడు:
'ఓవర్లో ఆరు వేర్వేరు బంతులు వేయమని డ్వేన్ బ్రావోకి చెప్పాను. బంతిని ఇచ్చిన రెండో బంతికే విరాట్ కోహ్లీని బ్రావో ఔట్ చేశాడు. సింపుల్ ప్రణళికనే మేము అమలు చేశాం కానీ కోహ్లీ ఈజీగా బుట్టలో పడ్డాడు. యూఏఈ పిచులు మూడు వేర్వేరుగా ఉంటాయి. ముఖ్యంగా షార్జా నెమ్మదిగా ఉంటుంది. ఎడమ-కుడి కలయిక ముఖ్యమని నేను భావించాను. జట్టులో చాలా మంది లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్లు ఉన్నారు. వారందరూ ఏ స్థానంలోనైనా బ్యాటింగ్ చేయడం ఉపయోగకరం. అందుకే మేము సురేష్ రైనా మరియు అంబటి రాయుడిని లోయర్ ఆర్డర్లో పంపిస్తున్నాం. మా ప్లేయర్స్ అందరూ బాగా ఆడారు. ఆ ఫలితమే ఈ విజయం' అని చెన్నై కెప్టెన్ చెప్పుకొచ్చాడు.
ఓడిపోవడం బాధగా ఉంది:
'మేం 175 పరుగులు చేయాల్సింది. అప్పుడు పోరాడటానికి వీలుండేది. పిచ్ నుంచి బౌలర్లకు సహకారం లభించింది. కానీ మా బౌలర్లు దాన్ని ఉపయోగించుకోలేకపోయారు. చెన్నై బౌలర్లు మాత్రం అద్భుతంగా బౌలింగ్ చేశారు. కచ్చితమైన యార్కర్లతో మమ్మల్ని కట్టడి చేశారు. దాంతో ధాటిగా ఆడటం కష్టంగా మారింది. మా బౌలర్లు మాత్రం చాలా బౌండరీ బాల్స్ ఇచ్చారు. ఎక్కడైతే బౌలింగ్ చేయవద్దమని చెబుతామో ఆ ఏరియాల్లోనే బంతులు వేసి మూల్యం చెల్లించుకున్నారు. ముఖ్యంగా ఫస్ట్ పవర్ ప్లేలో ధారళంగా పరుగులిచ్చుకున్నారు. మా బౌలింగ్లో తొలి ఐదు ఓవర్లలో X ఫ్యాక్టర్ మిస్సయింది. కానీ లో స్కోరింగ్ గేమ్స్ను కాపాడుకోవాలంటే కచ్చితమైన బంతులు వేయడం చాలా అవసరం. మేం తప్పక గెలవాల్సిన మ్యాచ్ ఇది. అయితే ఈ ఓటమి గత మ్యాచ్ కంటే తీవ్రంగా నిరాశపరిచింది. మ్యాచ్ సగం వరకు ఆధిపత్యం కనబర్చిన మేం ఇలా ఓడిపోవడం బాధగా ఉంది' అని బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ చెప్పుకొచ్చాడు.