టాస్ ఆలస్యం:
అయితే బెంగళూరు, చెన్నై మ్యాచ్లో ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. రాత్రి 7 గంటలకు బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ, చెన్నై సారథి ఎంఎస్ ధోనీ టాస్ వేసేందుకు షార్జా మైదానంలోకి వచ్చారు. అదే సమయంలో ఒక్కసారిగా ఇసుక తుపాను రావడంతో.. మైదానం పరిసరాల్లో దుమ్ముధూళి అలుముకుంది. దాంతో అంపైర్లు టాస్ను కొంతసేపు ఆలస్యం చేశారు. దీంతో ఇరు జట్ల సారథులు కోహ్లీ, ధోనీ.. సరదా కబుర్లు చెప్పుకున్నారు. చాలా సమయం మాట్లాడుకున్నారు. ఈ క్రమంలో ఇద్దరు కలిసి నవ్వుకున్నారు. ఇందుకు సంబందించిన వీడియోను ఐపీఎల్ యాజమాన్యం ట్విటర్లో పోస్టు చేశారు.
చాలా రోజుల తర్వాత:
ఐపీఎల్ పోస్ట్ చేసిన వీడియో చూసిన భారత అభిమానులు సంతోషంతో లైకులు, కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. విరాట్ కోహ్లీ, ఎంఎస్ ధోనీని ఇలా చూడటం బాగుందని పేర్కొన్నారు. ఇద్దరు చాలా రోజుల తర్వాత కలిశారు కదా.. ఏం మాట్లాడుకుంటున్నారో అని మరికొందరు చెవులు కోరుకుంటున్నారు. టీ20 ప్రపంచకప్ 2021లో భారత్ గురించి చర్చించి ఉండొచ్చని పలువురు అభిప్రాయపడుతున్నారు. అక్టోబర్ నెలలో యూఏఈలోనే జరిగే టీ20 ప్రపంచకప్లో ఎంఎస్ ధోనీ భారత జట్టుకు మెంటార్గా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. మరోవైపు ఐపీఎల్లో వీరిద్దరూ టాస్కు రావడం ఇదే ఆఖరిసారి అయ్యే అవకాశం లేకపోలేదు. ఎందుకంటే.. మహీ ఈ సీజన్ తర్వాత ఐపీఎల్లో కొనసాగేది అనుమానంగా కనిపిస్తోంది. కోహ్లీ కూడా బెంగళూరు సారథిగా ఇదే చివరి సీజన్ అని స్పష్టం చేశాడు.
ప్లే ఆఫ్స్కు అర్హత సాధిస్తేనే:
చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు ఇప్పటికే పట్టికలో అగ్రస్థానంలో ఉన్నాయి. 7 విజయాలతో చెన్నై పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది. 5 విజయాలతో బెంగళూరు మూడో స్థానంలో ఉంది. ప్లే ఆఫ్ చేరేందుకు చెన్నైకి ఎక్కువ అవకాశాలు ఉండగా.. బెంగళూరు కూడా ఉన్నాయి. ఈ సీజన్లో రెండుసార్లు తలపడిన సంగతి కూడా తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇరు జట్లూ ప్లే ఆఫ్స్కు అర్హత సాధిస్తే తప్ప విరాట్ కోహ్లీ, ఎంఎస్ ధోనీలను చూసే అవకాశం లేనట్లే. మరి ఏం జరుగుతుందో చూడాలి. ఫాన్స్ మాత్రం ఈ ఇద్దరు మరోసారి మైదానంలో కలిసి సందడి చేయాలని కోరుకుంటున్నారు.
|
కోహ్లీని ఔట్ చేసేందుకు ధోనీ ప్రణాళిక:
ఈ మ్యాచులో విరాట్ కోహ్లీని ఔట్ చేసేందుకు ఎంఎస్ ధోనీ ఓ ప్రణాళిక అమలు చేశాడు. తొలి వికెట్కి 13.2 ఓవర్లలోనే 111 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన ఓపెనింగ్ జోడీని.. 14వ ఓవర్లో కోహ్లీని ఔట్ చేయడం ద్వారా డ్వేన్ బ్రావో విడదీశాడు. వాస్తవానికి 14వ ఓవర్ని స్పిన్నర్ మొయిన్ అలీతో వేయించాలని తొలుత మహీ భావించాడట. కానీ పిచ్ స్లోగా మారడంతో ఆఖరి నిమిషంలో మనసు మార్చుకుని స్లో డెలివరీలను సమర్థంగా వేయగల బ్రావో చేతికి బంతిని ఇచ్చాడు. రెండో బంతికే కోహ్లీని ఔట్ చేశాడు.