CSK VS RCB: ఐపీఎల్ 2025లో భాగంగా చెన్నై చెపాక్ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచులో ఆర్సీబీపై దారుణంగా ఓడిపోయింది చెన్నై సూపర్ కింగ్స్. సొంత గడ్డపై ఓడిపోవడంతో సీఎస్కేపై తీవ్రంగా విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా సీఎస్కే స్పిన్ విభాగం తేలిపోయింది. సీనియర్లు స్పిన్నర్లు జడేజా, అశ్విన్ తెలిపోగా.. కేవలం నూర్ అహ్మద్ (3/36) మాత్రమే ఆర్సీబీపై ప్రభావం చూపించాడు. అయితే వీరిలో జడేజాతో తేలిపోయినప్పటికీ.. ఐపీఎల్ చరిత్రలో ఏ ప్లేయర్ సాధించని ఓ ఘనతను అందుకున్నాడు. ఓ గొప్ప రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. అదేంటంటే..
గత 13 ఏళ్లుగా..
ఆల్ రౌండర్ జడేజా తన ఐపీఎల్ కెరీర్ ను 2008లో రాజస్థాన్ రాయల్స్ తరఫున మొదలు పెట్టాడు. ఆ తర్వాత గత 13 ఏళ్లుగా సీఎస్కే తరఫున ఆడుతున్నాడు. జడ్డూ రాకతో చెన్నై జట్టు స్పిన్ బౌలింగ్ టీమ్ బలంగా తయారైంది. ఎన్నో మ్యాచుల్లో జడ్డూ తన అద్భుతమైన బౌలింగ్ తో మ్యాచ్ మలుపు తిప్పాడు. బ్యాటింగ్ లోనూ రాణించాడు.

ఎవరూ సాధించని ఘనత..
కానీ తాజాగా ఆర్సీబీతో జరిగిన మ్యాచులో మాత్రం విఫలమైపోయాడు. 19 బంతుల్లో 25 పరుగులు మాత్రమే చేశాడు. అందులో రెండు సిక్సులు, ఓ ఫోర్ ఉంది. బౌలింగ్ లోనూ తేలిపోయాడు. అయితే ఈ ఇన్నింగ్స్ లో 17.3 ఓవర్ దగ్గర సుజాశ్ శర్మ బౌలింగ్ లో బాదిన సిక్స్ తో ఓ అరుదైన రికార్డును సాధించాడు. ఐపీఎల్ చరిత్రలో 3 వేల పరుగులతో పాటు 100 వికెట్లు తీసిన ఏకైక ప్లేయర్ గా నిలిచాడు. ఐపీఎల్ లో ఆడిన ఇతర ఏ అల్ రౌండర్ కూడా ఈ ఘనత సాధించలేదు.
బ్యాటింగ్ ఆర్డర్ మారాలని..
కాగా, 2010 ఐపీఎల్ సీజన్ లో ఒక జట్టు నుంచి మరో జట్టుకు అనుమతి లేకుండా మారేందుకు ప్రయత్నించిన జడ్డూ .. ఆ సీజన్ వరకు నిషేధానికి గురైన సంగతి తెలిసిందే. అయితే జడేజాకు మంచి రికార్డు ఉన్నప్పటికీ గత కొద్దికాలంగా తన స్థాయికి తగ్గట్టుగా బ్యాటింగ్ ప్రదర్శన చేయట్లేదు.దీంతో క్రికెట్ ఫ్యాన్స్ కాస్త నిరాశ చెందుతున్నారు. మునపటి స్థాయిలో బ్యాటుతో చెలరేగాలని ఆశిస్తున్నారు. ఇదే సమయంలో మరికొంతమంది జడ్డూ స్టామినా ఏంటో చెప్పడానికి తాజా రికార్డే నిదర్శనమని కామెంట్లు చేస్తున్నారు. అలానే జడ్డూ నెం.4 లేదా నెం.5 స్థానంలో బ్యాటింగ్ చేయాలని అడుగుతున్నారు.