CSK VS RCB: ఐపీఎల్ 2025లో భాగంగా తాజాగా జరిగిన మ్యాచులో చెన్నై సూపర్ కింగ్స్ ఓటమి చెందిన సంగతి తెలిసిందే. చెన్నై చెపాక్ స్టేడియం వేదికగా జరిగిన ఈ బిగ్ ఫైట్ లో రజత్ పటీదార్ నేతృత్వంలోని ఆర్సీబీ విజయం సాధించింది. దాదాపు 17 ఏళ్ల తర్వాత చెపాక్ స్టేడియంలో చెన్నైపై ఆర్సీబీ గెలుపొందింది. అయితే ఈ మ్యాచుతో ధోనీ చరిత్ర సృష్టించాడు. ఓ అరుదైన రికార్డును ఖాతాలో వేసుకున్నాడు.
ఆల్ రౌండ్ ప్రదర్శన..
రజత్ పాటీదార్ (32 బంతుల్లో 51; 4×4, 3×6) కెప్టెన్ ఇన్నింగ్స్కు ఫిల్ సాల్ట్ (16 బంతుల్లో 32; 5×4, 1×6), పడిక్కల్ (14 బంతుల్లో 27; 2×4, 2×6), కోహ్లీ (30 బంతుల్లో 31; 2×4, 1×6) తోడవ్వడంతో మొదట 196 పరుగులు చేసింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. అలానే లక్ష్య ఛేదనకు దిగిన సీఎస్కేలోని కీలక వికెట్లను, బౌలర్ల తమ అద్భుత ప్రదర్శనతో పడగొట్టడంతో ఆర్సీబీ ఘన విజయాన్ని అందుకుంది.

ధోనీ అరుదైన రికార్డ్..
ఇక లక్ష్య ఛేదనలో రచిన రవీంద్ర (41; 31 బంతుల్లో 5×4) ఒక్కడే రాణించి ఆ జట్టులో టాప్ స్కోరర్ గా నిలిచాడు. చివర్లో స్టార్ అండ్ సీనియర్ బ్యాటర్ ధోనీ 16 బంతుల్లో రెండు సిక్స్ లు, మూడు ఫోర్ల సాయంతో 30 పరుగులు మెరుపులు మెరిపించాడు. అయితే ఈ క్రమంలోనే తన షార్ట్ ఇన్నింగ్స్ తో ధీటుగా ఆడిన ధోనీ ఓ అరుదైన రికార్డు కూడా సాధించాడు.
ఐపీఎల్ చరిత్రలోనే...
ఐపీఎల్ చరిత్రలో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున అత్యధిక పరుగులు సాధించిన క్రికెటర్ గా నిలిచాడు. 236 మ్యాచుల్లో 4699 పరుగులు సాధించాడు. తద్వారా సురేశ్ రైనా (176 మ్యాచుల్లో 4687) పేరిట ఉన్న రికార్డును అధిగమించాడు. వీరిద్దరి తర్వాత డుప్లెసిస్ (2721), రుతురాజ్ గైక్వాడ్ (2433), అంబటి రాయుడు (1932) వరుస స్థానాల్లో ఉన్నారు.