CSK VS RCB: ఐపీఎల్ 2025లో భాగంగా చెన్నై చెపాక్ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై దారుణంగా ఓడిపోయింది చెన్నై సూపర్ కింగ్స్. సొంత గడ్డపైనే పేలవ ప్రదర్శన చేసి ఓడిపోవడంతో సీఎస్కేను తీవ్రంగా విమర్శిస్తున్నారు క్రికెట్ అభిమానులు. సోషల్ మీడియా వేదికగా చెన్నై జట్టును, ధోనీని ఫుల్ ట్రోలింగ్ చేస్తున్నారు. అస్సలు వదలకుండా ఓ ఆటాడేసుకుంటున్నారు. మాజీ క్రికెటర్లు కూడా జట్టు చేసిన తప్పిదాలను వివరిస్తూ.. విమర్శల వర్షం కురిపిస్తున్నారు.
ప్లే ఆఫ్స్ రేసులో నిలవాలంటే...
ఈ క్రమంలోనే సీఎస్కే మాజీ బ్యాటర్ అంబటి రాయుడు తన ప్రియమైన సీఎస్తే జట్టుకు కాస్త చురకలు అంటించాడు. సీఎస్కే జట్టు ప్రస్తుత మిడిలార్డర్ బలంగా లేదని విమర్శించాడు. ప్లే ఆఫ్స్ రేసులో నిలవాలంటే మిడిలార్డర్ లో కొన్ని మార్పులు చేయాల్సిందేనని సూచించాడు.

అది మంచిది కాదు...
"ప్రస్తుతం CSK మిడిల్ ఆర్డర్ అంత బలంగా లేదు. దాంతో జట్టును నెట్టుకు రావడం కష్టం. మంచి బౌలింగ్ ప్రదర్శన చేసినప్పటికీ, అలానే మంచి స్కోర్ సాధించడం కోసం ఉత్తమైన బ్యాటర్లను ఆ స్థానాల్లో ఆడించాలి. రుతురాజ్ కచ్చితంగా ఓపెనింగ్ చేయాలి. అలాగే రవీంద్ర జడేజా బ్యాటింగ్ ఆర్డర్ మార్చాలి. కాస్త పైకి తీసుకురావాలి. ధోనీని లోయర్ ఆర్డర్ లో అంత చివరికి పంపించడం సరైనది కాదు. CSKకు ఇది పెద్ద సవాల్. పైగా వాళ్లు స్పిన్ బౌలింగ్ను కూడా సరిగా ఎదుర్కోవడం లేదు. ఇది ఆ జట్టుకు పెద్ద సమస్యగా కనిపిస్తోంది," అని అంబాటి రాయుడు మ్యాచ్ అనంతరం సీఎస్కే ఓటమిపై మాట్లాడాడు.
అది సరైనది కాదు...
రాబిన్ ఉతప్ప మాట్లాడుతూ.. "రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఇది కీలక విజయం. చెపాక్ స్టేడియంలో విజయం సాధించడం ఆ జట్టుకు మరింత ఉత్సాహంతో పాటు బలాన్ని ఇస్తుంది.ధోనీ నెం.9వ స్థానంలో రావడం సరైనది కాదు. కాస్త ముందుగా వచ్చి ఉంటే విజయం సాధించే అవకాశం ఉంటుంది. కనీసం నెట్రన్రేట్ను అయినా మెరుగు పర్చుకోవచ్చు." అని అన్నాడు. ఇర్ఫాన్ పఠాన్ మాట్లాడుతూ.. "మహీ 9వ నెం.లో బ్యాటింగ్కు దిగడం సరిగ్గా అనిపించలేదు. జట్టు తీసుకున్న నిర్ణయం సరిగ్గా లేదు. ఇలా చేస్తే సీఎస్కేకు ఎటువంటి ప్రయోజనం కలుగదు" అని పేర్కొన్నాడు.