
రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్లో చెన్నైసూపర్ కింగ్స్ బ్యాటర్ శివమ్ దూబే విశ్వరూపం చూపించాడు. ఫోర్లు, సిక్సులతో ఆర్సీబీ బౌలర్లపై విరుచుకుపడి కెరీర్ బెస్ట్ ఇన్నింగ్స్ ఆడాడు. 6.4 ఓవర్లలో 36 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి సీఎస్కే కష్టాల్లో ఉన్న సమయంలో శివమ్ దూబే బ్యాటింగ్కు వచ్చాడు. ఈ క్రమంలో జట్టు పాలిట ఆపద్భాందవుడిగా మారాడు. ఓపెనర్ రాబిన్ ఊతప్పతో కలిసి జట్టును ఆదుకోవడమే కాకుండా కళ్లు చెదిరే భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. మైదానంలో ఏకంగా సిక్సుల సునామీనే సృష్టించాడు. 53 బంతుల్లో సెంచరీ భాగస్వామ్యం, 73 బంతుల్లో 165 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఈ క్రమంలో జట్టు స్కోర్ను సునాయసంగా 200 దాటించాడు. మొత్తంగా ఆర్సీబీ ముందు సీఎస్కే కొండంత లక్ష్యాన్ని ఉంచడంలో శివమ్ దూబే కీలక పాత్ర పోషించాడు.
ఈ క్రమంలో శివమ్ దూబే 30 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. ఈ సీజన్లో దూబేకు ఇది రెండో హాఫ్ సెంచరీ కాగా, ఐపీఎల్ కెరీర్లో మూడోది. మొత్తంగా 46 బంతుల్లోనే 95 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఇన్నింగ్స్ చివరి బంతికి సిక్సు బాది సెంచరీ కొట్టే ప్రయత్నం చేసినప్పటికీ అది సాధ్యం కాలేదు. 5 ఫోర్లు, 8 సిక్సులతో 206 స్ట్రైక్రేట్తో బ్యాటింగ్ చేశాడంటే శివమ్ దూబే విధ్వంసం ఏ రేంజ్లో కొనసాగిందో అర్థం చేసుకోవచ్చు. దూబే విధ్వంసం ధాటికి ఆర్సీబీ బౌలర్లు భారీగా పరుగులు సమర్పించుకున్నారు. ఒక రకంగా ఈ మ్యాచ్లో శివమ్ దూబే శివమెత్తాడని చెప్పుకోవచ్చు. అతనికి ఊతప్ప కూడా 50 బంతుల్లోనే 88 పరుగులు చేసి సహకరించాడు.

శివమ్ దూబే, రాబిన్ ఊతప్ప చెలరేగడంతో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ముందు చెన్నైసూపర్ కింగ్స్ 217 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. సీఎస్కే నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 216 పరుగుల భారీ స్కోర్ చేసింది. దూబే, ఊతప్ప దెబ్బకు ఆర్సీబీ బౌలర్లు భారీగా పరుగులు సమర్పించుకున్నారు. అక్షయ్ దీప్ 4 ఓవర్లలోనే ఏకంగా 58 పరుగులు ఇచ్చాడు. ఇక హసరంగ 2, హేజిల్వుడ్ ఒక వికెట్ తీశారు.