CSK vs PBKS: ఐపీఎల్ 2026లో భాగంగా చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియం వేదికగా జరుగుతున్న 7వ మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటర్లు చెలరేగిపోయారు. యువ సంచలనం ఆయుష్ మాత్రే(73) విధ్వంసకర ఇన్నింగ్స్తో ఆకట్టుకోగా.. నిర్ణీత 20 ఓవర్లలో సీఎస్కే 5 వికెట్లు కోల్పోయి 209 పరుగుల భారీ స్కోరు సాధించింది. పంజాబ్ కింగ్స్ విజయం సాధించాలంటే 210 పరుగులు చేయాల్సి ఉంది. ముందుగా టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. అయితే సొంత గడ్డపై ఆడుతున్న చెన్నైకి ఆరంభంలోనే గట్టి షాక్ తగిలింది. స్టార్ ఓపెనర్ సంజు శాంసన్ (7) రెండో ఓవర్లోనే జేవియర్ బార్ట్లెట్ బౌలింగ్లో కీపర్ కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు.
ఆయుష్ మాత్రే - రుతురాజ్ కీలక భాగస్వామ్యం
సంజు శాంసన్ అవుట్ అయిన తర్వాత క్రీజులోకి వచ్చిన యువ ఆటగాడు ఆయుష్ మాత్రే, కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్తో కలిసి ఇన్నింగ్స్ను ముందుకు నడిపించాడు. ముఖ్యంగా మాత్రే పంజాబ్ బౌలర్లపై నిర్దాక్షిణ్యంగా విరుచుకుపడ్డాడు. కేవలం 29 బంతుల్లోనే తన అర్థ శతకం పూర్తి చేసుకున్నాడు. వీరిద్దరూ రెండో వికెట్కు 96 పరుగుల విలువైన భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. రుతురాజ్ గైక్వాడ్ 22 బంతుల్లో 28 పరుగులు చేసి యుజ్వేంద్ చాహల్ బౌలింగ్లో అవుట్ కావడంతో ఈ జోడీ విడిపోయింది. ఆయుష్ మాత్రే 43 బంతుల్లో 73 పరుగులు (6 ఫోర్లు, 5 సిక్సర్లు) చేసి వైశాఖ్ విజయ్కుమార్ బౌలింగ్లో వెనుదిరిగాడు. ఆ తర్వాత వచ్చిన కార్తీక్ శర్మ (1) నిరాశపరిచాడు.

చివర్లో సర్ఫరాజ్, దూబే మెరుపులు
మధ్య ఓవర్లలో వికెట్లు పడినా, సర్ఫరాజ్ ఖాన్ ఇన్నింగ్స్కు మళ్ళీ ఊపు తెచ్చాడు. కేవలం 12 బంతుల్లో 32 పరుగులు (6 ఫోర్లు, 1 సిక్సర్) బాది స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. చివర్లో శివమ్ దూబే కూడా మెరుపులు మెరిపించడంతో సీఎస్కే 200 మార్కును దాటి 209 పరుగుల వద్ద నిలిచింది. పంజాబ్ బౌలర్లలో వైశాఖ్ విజయ్ కుమార్ 2 వికెట్లు పడగొట్టగా.. జేవియర్ బార్ట్లెట్, మార్కో యన్సెన్, యుజ్వేంద్ర తలో వికెట్ తీసుకున్నారు.
స్లో ఓవర్ రేట్ - పంజాబ్కు శాపం?
పంజాబ్ కింగ్స్ నిర్ణీత సమయం కంటే వెనుకబడి ఉండటంతో, చివరి రెండు ఓవర్లలో కేవలం నలుగురు ఫీల్డర్లను మాత్రమే సర్కిల్ వెలుపల ఉంచే అవకాశం దక్కింది. ఈ అవకాశాన్ని వాడుకున్న సీఎస్కే బ్యాటర్లు ఆ చివరి 12 బంతుల్లో ఏకంగా 26 పరుగులు రాబట్టారు. ఈ అదనపు పరుగులే మ్యాచ్ ఫలితాన్ని శాసిస్తాయా అన్నది వేచి చూడాలి.