ఐపీఎల్ 2025లో భాగంగా తాజాగా జరిగిన మ్యాచ్ లో ముంబయి ఇండియన్స్పై చెన్నై సూపర్ కింగ్స్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే మ్యాచ్ అనంతరం ముంబయి ఫాస్ట్ బౌలర్ దీపక్ చాహర్ తో కలిసి ధోనీ చేసిన ఓ ఫన్నీ మూమెంట్ క్రికెట్ అభిమానులను తెగ ఆకట్టుకుంటోంది. ఆ సమయంలో మహీ.. దీపక్ చాహర్ను బ్యాట్తో కొట్టడం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
అసలేం జరిగిందంటే?
అంతకుముందు సీఎస్కేకు ఆడిన దీపిక్ చాహర్ను ఐపీఎల్ 2025 మెగా వేలంలో ముంబయి ఇండియన్స్ కొనుగోలు చేసింది. అతడు కూడా ముంబయి తరఫున తన తొలి మ్యాచ్ లోనే మంచిగానే రాణించాడు. ఓ దశలో ముంబయి 128/8 తక్కువ స్కోరుకే ఆలౌటయ్యేలా కనిపించింది. కానీ ఆఖర్లో వచ్చిన చాహర్ 15 బంతుల్లో 2x4, 2x6 సాయంతో 28 నాటౌట్ బ్యాట్ ఝళిపించడంతో ముంబయి కాస్త పోరాడే స్కోర్ చేసింది. మరోవైపు ధోనీ కూడా తన 43ఏళ్ల వయసులో మెరుపు వేగంతో స్టంపింగ్ చేసి ఆశ్చర్యపరిచాడు. అలానే ఆఖర్లో బ్యాటింగ్ కు దిగిన ధోనీ.. రెండు డాట్ బాల్స్ ఆడాడు. అయితే ఆ తర్వాత రచిన్ రవీంద్ర సిక్స్ తో మ్యాచ్ ను ముగించాడు.

మ్యాచ్ ముగిశాక ఇరు జట్ల ఆటగాళ్లు షేక్ హ్యాండ్ ఇచ్చుకోవడం ఆనవాయితీ. అలానే ఈ మ్యాచ్ లోనూ ముంబయి - సీఎస్కే ఆటగాళ్లు కరచాలనం చేసుకున్నారు. ఆ సమయంలోనే ధోనీ, తన మాజీ ప్లేయర్ దీపక్ చాహర్ తో కలిసి సరదాగా కాసేపు ముచ్చటించాడు. మాటల మధ్యలో సరదాగా తన బ్యాట్ తో అతడిని కొట్టబోయాడు. వెంటనే దీపక్ కూడా ధోనీ బాదుడి నుంచి తప్పించుకోబోయాడు. ఈ మూమెంట్ వెంటనే టెలివిజన్ కెమెరాల్లో చిక్కి, సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. క్రికెట్ అభిమానులను ఆకట్టుకున్న ఈ మూమెంట్.. ధోనీ-చాహర్ మధ్య అనుబంధం గురించి అందరూ మాట్లాడుకునేలా చేసింది.