ఐపీఎల్ 2025 సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ శుభారంభం చేసింది. ఓ దశలో ముంబయి బౌలర్లు పుంజుకోవడంతో మ్యాచ్ ఉత్కంఠగా మారింది. అయినా కూడా సీఎస్కే బ్యాటర్లు మంచిగా రాణించారు. దీంతో ఈ మ్యాచ్ లో ముంబయి ఇండియన్స్ పై చెన్నై జట్టు 4 వికెట్ల తేడాతో గెలిచింది. బ్యాట్తో రచిన్, రుతురాజ్.. బంతితో నూర్, ఖలీల్ విజయంలో కీలకంగా వ్యవహరించారు. దీంతో మ్యాచ్ అనంతరం విజయంపై సంతోషం వ్యక్తం చేశాడు సీఎస్కే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్. తమ విజయాన్ని అసలు కారణం ఎవరో వివరించాడు.
"గెలవడం ఎంతో సంతోషంగా ఉంది. మరింత మంచిగా రాణించాలనిపించింది. కానీ ఇది ఆటలో సహజమే. మూడో స్థానంలో ఆడటం ఎంతో ఆనందంగా ఉంది. ఆ స్థానంలో ఆడటం జట్టుకు అవసరం. అదే జట్టుకు మరింత సమతుల్యతను ఇస్తుంది. అందుకే నా స్థానాన్ని మార్చుకోవడంలో నేను ఎంతో సంతోషిస్తున్నాను. మా స్పిన్నర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. చెపాక్లో మా ముగ్గురు స్పిన్నర్లు కలిసి బౌలింగ్ చేయడం మాకు నిజంగా ఉత్సాహాన్నిచ్చింది. ఖలీల్ అనుభవజ్ఞుడైన ప్లేయర్. నూర్ కీలక ఆటగాడు. యష్ జట్టులో ఉండటం కూడా గొప్ప ప్రయోజనమే." అని అన్నాడు.

ఈ మ్యాచ్ లో మెరుపు స్టంపింగ్ చేసిన ధోనీ గురించి మాట్లాడుతూ.. ధోనీ ఈ ఏడాది మరింత ఫిట్గా ఉన్నాడు. ఇంకా యవ్వనంగా కనిపిస్తున్నాడు. అని పేర్కొన్నాడు. కాగా, ఈ మ్యాచ్ లో నూర్ అహ్మద్ వేసిన 11 ఓవర్ లో మూడో బంతికి సూర్య షాట్ ఆడదామని భావించిన సూర్య క్రీజు వదిలి బయటకు వచ్చాడు. కానీ స్పిన్ తిరిగిన బంతిని ధోనీ అందుకుని ఠక్కున బెయిల్స్ లేపాడు. కేవలం 0.12 సెకన్లలో ధోనీ స్టంపౌట్ చేయడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. 43 ఏళ్ల వయసులో ఇలా ఆడడంతో అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు.
ఈ మ్యాచ్ లో ముంబయి ఇండియన్స్ మొదట 9 వికెట్లు కోల్పోయి 155 పరుగులు చేసింది. తిలక్వర్మ (25 బంతుల్లో 2×4, 2×6 సాయంతో 31 పరుగులు) టాప్ స్కోరర్ గా నిలిచాడు. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డును నూర్ అహ్మద్ (4/18) అందుకున్నాడు. ఖలీల్ అహ్మద్ (3/29) ప్రత్యర్థిని బలంగా కట్టడి చేశాడు. రచిన్ రవీంద్ర (45 బంతుల్లో 2×4, 4×6 సాయంతో 65 నాటౌట్), కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ (26 బంతుల్లో 6×4, 3×6 పరుగుల సాయంతో 53) బాగా రాణించారు. దీంతో చెన్నై జట్టు 19.1 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ముంబయి బౌలర్లలో విఘ్నేశ్ (3/32) మంచి ప్రదర్శన చేశాడు. కాగా, 2012 నుంచి ముంబయి తన తొలి మ్యాచ్లో ఓడిపోతూనే ఉండటం గమనార్హం.