చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అది ప్రత్యర్థి మైదానం అయినప్పటికీ స్టేడియమంతా సీఎస్కే జెర్సీలతో, ఎల్లో ఫ్లాగ్స్తోనే ఎక్కువగా కనిపిస్తుంటుంది. ధోనీని చూడాలనే ఒకే కారణంతో మైదానమంతా ఎల్లోమయంగా మారిపోతుంటుంది. అందుకే అభిమానుల కోసం కెమెరామెన్ కూడా ధోనీపైనే ఎక్కువగా ఫోకస్ చేస్తుంటారు.
అవకాశం దొరికిన ప్రతీసారి ధోనీనే బిగ్ స్క్రీన్పై చూపిస్తుంటారు. ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో నయా కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ను వదిలేసి ధోనీపైనే ఫోకస్ చేస్తుంటారు. ఈ విషయంపై మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ కూడా కెమెరా వాళ్లని గతంలో వ్యంగ్యంగా విమర్శించాడు. కెప్టెన్ను కూడా అప్పుడుప్పుడు చూపిస్తుండండి అంటూ ఆటపట్టించాడు.

అయితే మంగళవారం చెపాక్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్-లక్నో సూపర్ జెయింట్స్ మధ్య జరిగిన మ్యాచ్లో కెమెరామెన్ మరోసారి ధోనీపై స్పెషల్ ఫోకస్ చేశారు. డ్రెస్సింగ్ రూమ్లో ఉన్న ధోనీని కెమెరా సిబ్బంది పదేపదే బిగ్స్క్రీన్పై చూపించారు. దీంతో విసిగిపోయిన ధోనీ కెమెరామెన్కు తన కోపాన్ని చూపించాడు. చేతిలో ఉన్న బాటిల్ తీసుకుని కొట్టేస్తా అన్నట్లుగా ధోనీ రియాక్ట్ అయ్యాడు. వెంటనే కెమెరామెన్ భయపడిపోయి ఫోకస్ను డైవర్ట్ చేశాడు.
దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. కాగా, ఈ మ్యాచ్లో చెన్నై ఆరు వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. తొలుత బ్యాటింగ్ చేసిన సీఎస్కే నాలుగు వికెట్లకు 210 పరుగులు చేసింది. రుతురాజ్ గైక్వాడ్ (108*; 60 బంతుల్లో, 12x4, 3x6) అజేయ శతకంతో చెలరేగాడు. అతనికి తోడుగా శివమ్ దూబె (66; 27 బంతుల్లో, 3x4, 7x6) కూడా సత్తాచాటాడు. ఒక్క బంతి ఎదుర్కొన్న ధోనీ బౌండరీ సాధించాడు.
అనంతరం ఛేదనలో లక్నో 19.3 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది. మార్కస్ స్టొయినిస్ (124*; 63 బంతుల్లో, 13x4, 6x6) విధ్వంసం సృష్టించి లక్నోను విజయతీరాలకు చేర్చాడు. నికోలస్ పూరన్ (34; 15 బంతుల్లో, 3x4, 2x6) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు.