ఆకట్టుకున్న గైక్వాడ్, డుప్లెసిస్:
172 పరుగుల లక్ష్య ఛేదనలో చెన్నై సూపర్ కింగ్స్కు ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్, ఫాఫ్ డుప్లెసిస్ మంచి ఆరంభం ఇచ్చారు. ప్రసిద్ధ్ కృష్ణ వేసిన మూడో ఓవర్లో రెండు ఫోర్లు బాదిన డుప్లెసిస్.. తర్వాత వరుణ్ చక్రవర్తి వేసిన ఓవర్లోనూ మరో రెండు బాదాడు. సునీల్ నరైన్ వేసిన ఐదో ఓవర్లో గైక్వాడ్ ఓ సిక్స్, ఫోర్ కొట్టడంతో చెన్నై స్కోర్ పరుగులు పెట్టింది. అయితే దూకుడుగా ఆడుతున్న రుతురాజ్ని ఆండ్రీ రసెల్ 9వ ఓవర్లో అవుట్ చేశాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన మొయిన్ అలీ (35; 28 బంతుల్లో 2×4, 2×6) ఫర్వాలేదనిపించాడు. తన ఫామ్ కొనసాగిస్తూ చెన్నైకి విలువైన పరుగులు అందించాడు. అయితే ప్రసిద్ధ్ వేసిన 11.3 ఓవర్కు ఫాఫ్ డుప్లెసిస్ ఔటయ్యాడు.
జడేజా మెరుపు ఇన్నింగ్స్:
తెలుగు తేజం అంబటి రాయుడు (10) నిరాశపరిచాడు. సునీల్ నరైన్ బౌలింగ్లో అతడు పెవిలియన్ చేరాడు. లుకీ ఫెర్గూసన్ వేసిన 17వ ఓవర్లో మొయిన్ అలీ ఔట్ అవ్వడంతో చెన్నై స్కోరుకు బ్రేకులు పడ్డాయి. ఈ సమయంలో సురేష్ రైనా (11), ఎంఎస్ ధోనీ (1) ఔటవడంతో చివర్లో ఉత్కంఠ నెలకొంది. చెన్నై విజయానికి 12 బంతుల్లో 26 పరుగులు అవసరం అయ్యాయి. ఈ సమయంలో రవీంద్ర జడేజా మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. ప్రసిద్ధ్ వేసిన 19వ ఓవర్లో రెండు ఫోర్లు, 2 సిక్సులు బాది మొత్తంగా 21 పరుగులు పిండుకున్నాడు. సామ్ కరన్ కూడా మరో పరుగు తీశాడు. చివరి ఓవర్లో 4 పరుగులు అవసరం అవ్వగా.. రెండు వికెట్లు పడడంతో మ్యాచ్ చివరి బంతి వరకు సాగింది. దీపక్ చహర్ చివరి బంతికి ఒక పరుగు తీసి జట్టుకు విజయాన్ని అందించాడు.
ఆరంభంలోనే షాక్:
అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కోల్కతా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 171 రన్స్ చేసింది. ఇన్నింగ్స్ ఆరంభంలోనే కోల్కతాకు భారీ ఎదురు దెబ్బ తగిలింది. ఓపెనర్ శుభమన్ గిల్ (9)ని అంబటి రాయుడు రనౌట్ చేశాడు. ఆ తర్వాత యువ బ్యాటర్ వెంకటేశ్ అయ్యర్ (18; 15 బంతుల్లో 3x 4)తో కలిసి త్రిపాఠి ఇన్నింగ్స్ని చక్కదిద్దాడు. సామ్ కరన్ వేసిన ఇన్నింగ్స్ నాలుగో ఓవర్లో త్రిపాఠి సిక్స్, ఫోర్ బాదాడు. హేజిల్ వుడ్ వేసిన తర్వాతి ఓవర్లో వెంకటేశ్ అయ్యర్ రెండు ఫోర్లు కొట్టాడు. దాంతో కోల్కతా స్కోర్ వేగం పెరిగింది. అయితే ఆరో ఓవర్ వేసిన శార్దూల్ ఠాకూర్.. వెంకటేశ్ అయ్యర్ని ఔట్ చేసి కోల్కతాను దెబ్బ కొట్టాడు.
కార్తీక్ మెరుపులు:
వెంకటేశ్ అయ్యర్ ఔట్ అనంతరం కోల్కతా స్కోరు వేగం కాస్త నెమ్మదించింది. కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ (8) పూర్తిగా నిరాశపచాడు. ఆపై రవీంద్ర జడేజా వేసిన 13వ ఓవర్లో రాహుల్ త్రిపాఠి క్లీన్ బౌల్డయ్యాడు. అనంతరం ఆండ్రీ రసెల్ (20; 15 బంతుల్లో 2×4, 1×6) ధాటిగా పరుగులు చేశాడు. అయితే వేగంగా ఆడబోయి 17వ ఓవర్లో ఔటయ్యాడు. మరోవైపు నితీష్ రాణా మాత్రం వికెట్ కాపాడుకుంటూ పరుగులు చేశాడు. ఇక దినేశ్ కార్తీక్ ఇన్నింగ్స్ చివర్లో దూకుడుగా ఆడాడు. బౌండరీల మోత మోగించాడు. దీపక్ చాహర్ వేసిన 18వ ఓవర్లో రాణా రెండు ఫోర్లు బాదాడు. సామ్ కరన్ వేసిన 19వ ఓవర్లో దినేశ్ కార్తీక్ రెండు ఫోర్లు, ఓ సిక్స్ బాదాడు. జోష్ హేజిల్వుడ్ వేసిన చివరి ఓవర్లో కార్తీక్ ఔటయ్యాడు. దాంతో కోల్కతా 171 రన్స్ చేసింది. చెన్నై బౌలర్లలో జోష్ హజిల్వుడ్, శార్దుల్ ఠాకూర్ తలో రెండు వికెట్లు పడగొట్టారు.