
అబుదాబి: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021లో భాగంగా మరికొద్ది సేపట్లో అబుదాబి వేదికగా చెన్నై సూపర్ కింగ్స్, కోల్కతా నైట్ రైడర్స్ జట్ల మధ్య మ్యాచ్ ఆరంభం కానుంది. ఈ మ్యాచులో టాస్ గెలిచిన కోల్కతా కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్ కోసం మోర్గాన్ తుది జట్టులో ఎలాంటి మార్పులు చేయలేదు. యువ బ్యాటర్ వెంకటేశ్ అయ్యర్ మరోసారి చెలరేగాలని చూస్తున్నాడు. కోల్కతా యాజమాన్యం అతడిపై భారీ అంచనాలు పెట్టుకుంది. మరోవైపు చెన్నై కెప్టెన్ ఎంఎస్ ధోనీ తుది జట్టులో ఒక మార్పు చేశాడు. గాయం కారణంగా స్టార్ ఆల్రౌండర్ డ్వేన్ బ్రావో ఈ మ్యాచ్ ఆడడం లేదు. బ్రావో స్థానంలో మరో ఆల్రౌండర్ సామ్ కరన్ తుది జట్టులోకి వచ్చాడు.
పాయింట్ల పట్టికలో దూసుకుపోతున్న చెన్నై సూపర్ కింగ్స్.. కోల్కతా నైట్ రైడర్స్ను ఓడించి టాప్ లేపాలని చూస్తోంది. రెండో దశలో రెండు జట్లూ ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లను ఓడించి పూర్తి ఆత్మవిశ్వాసంతో ఉన్నాయి. అయితే ఇరు జట్లూ అటు బ్యాటింగ్లో, ఇటు బౌలింగ్లో పటిష్టంగా ఉండటంతో మ్యాచ్లో ఎవరు గెలుస్తారనే విషయంపై ఆసక్తి పెరిగింది. చెన్నై ఈ మ్యాచ్ గెలిస్తే ప్లే ఆఫ్ బెర్త్ దక్కించుకుంటుంది. కోల్కతా గెలిస్తే ప్లే ఆఫ్ బెర్త్ వైపు మరో అడుగు వేయనుంది. బెంగళూరును కిందకి నెట్టి మూడో స్థానంలోకి దూసుకెళ్లనుంది. మ్యాచ్ రసవత్తరంగా సాగనుంది.
ఐపీఎల్ టోర్నీలో ఇప్పటి వరకు చెన్నై సూపర్ కింగ్స్, కోల్కతా నైట్ రైడర్స్ జట్లు 26 మ్యాచుల్లో తలపడ్డాయి. ఇందులో చెన్నై16, కోల్కతా 9 మ్యాచుల్లో విజయం సాధించాయి. ఒక మ్యాచులో ఫలితం తేలలేదు. యూఏఈలో ఇప్పటి వరకు ఇరు జట్లు 2 మ్యాచుల్లో తలపడ్డాయి. ఇందులో చెన్నై, కోల్కతా తలో మ్యాచులో గెలిచాయి. పిచ్ విపరీతమైన తేమతో ఉంది. ఐపీఎల్ 2020లో ఈ వేదికపై మధ్యాహ్నం ఆటలలో మొదట బ్యాటింగ్ చేసే జట్ల సగటు స్కోరు 165గా నమోదైంది. ఇక్కడ ఓ మ్యాచ్ సూపర్ ఓవర్ వరకు కూడా వెళ్లింది.
తుది జట్లు:
చెన్నై సూపర్ కింగ్స్: ఫాఫ్ డుప్లెసిస్, రుతురాజ్ గైక్వాడ్, మొయిన్ అలీ, సురేశ్ రైనా, అంబటి రాయుడు, ఎంఎస్ ధోనీ (కెప్టెన్), రవీంద్ర జడేజా, సామ్ కరన్, శార్దూల్ ఠాకూర్, దీపక్ చహర్, జోష్ హేజిల్వుడ్.
కోల్కతా నైట్ రైడర్స్: వెంకటేశ్ అయ్యర్, శుభ్మన్ గిల్, రాహుల్ త్రిపాఠి, నితీశ్ రాణా, ఇయాన్ మోర్గాన్ (కెప్టెన్), దినేశ్ కార్తీక్, ఆండ్రీ రసెల్, సునీల్ నరైన్, లాకీ ఫెర్గూసన్, వరుణ్ చక్రవర్తి, ప్రసిద్ధ్ కృష్ణ.