చెన్నై సూపర్ కింగ్స్ తిరిగి గెలుపు బాట పట్టింది. చెపాక్ వేదికగా నిన్న కోల్కతా నైట్ రైడర్స్తో జరిగిన మ్యాచ్లో సీఎస్కే ఆల్రౌండ్షో తో అదరగొట్టింది. ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్లకు 137 పరుగులు చేసింది. శ్రేయస్ అయ్యర్ (34; 32 బంతుల్లో, 3x4) సునీల్ నరైన్ (27; 20 బంతుల్లో, 3x4, 2x6) టాప్ స్కోరర్లు. రవీంద్ర జడేజా (3/18), తుషార్ దేశ్పాండే (3/33)చెరో మూడు వికెట్లతో సత్తాచాటారు.
అనంతరం ఛేదనలో సీఎస్కే 17.4 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ (67*; 58 బంతుల్లో, 9x4) జట్టును విజయతీరాలకు చేర్చాడు. శివమ్ దూబె (28; 18 బంతుల్లో, 1x4, 3x6), డారిల్ మిచెల్ (25; 19 బంతుల్లో, 1x4, 1x6) రాణించారు. కేకేఆర్ బౌలర్లలో వైభవ్ అరోరా (2/28) రెండు వికెట్లు తీశాడు.

మ్యాచ్ ముగిసిన అనంతరం సీఎస్కే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ తమ జట్టు ప్రదర్శన గురించి మాట్లాడాడు. విజయం సాధించడం సంతోషంగా ఉందని తెలిపాడు. ఇవాళ హాఫ్ సెంచరీ అందుకున్న అనంతరం తన తొలి హాఫ్ సెంచరీ గుర్తు వచ్చిందని రుతురాజ్ పేర్కొన్నాడు. ఇది 150-160 పరుగులు చేయగలిగే పిచ్ అని, సిక్సర్లు సాధించే పిచ్ కాదని అన్నాడు.
''ఐపీఎల్లో నా తొలి హాఫ్ సెంచరీ గుర్తు వచ్చింది. అప్పుడు కూడా ఇదే పరిస్థితి. మహీ భాయ్ తోడుగా ఉన్నాడు. అజింక్య రహానెకు స్వల్ప గాయమవ్వడంతో ఈ కఠిన పిచ్పై ఆఖరి వరకు నేను క్రీజులో ఉండాలని భావించాను. ఇది 150 నుంచి 160 పరుగులు చేసే పిచ్. స్ట్రైక్ను రొటేట్ చేస్తూ బౌండరీల కోసం చూడాలి. ఇది సిక్సర్లు సాధించే వికెట్ కాదు. గత కొన్నేళ్లుగా జడేజా పవర్ప్లే తర్వాత బౌలింగ్ చేస్తున్నాడు''
''జట్టులోని ఆటగాళ్లకు వాళ్ల బాధ్యతల గురించి నేనేమి చెప్పట్లేదు. వాళ్లు మంచి లయలోనే ఉన్నారు. ఫ్లెమింగ్, ధోనీ జట్టుతోనే ఉన్నారు. అయితే నేను నెమ్మదిగా ఆటను ప్రారంభించా అని అనుకోవట్లేదు. టీ20 క్రికెట్లో కూడా కొన్ని బంతులు చూడాలి. అంతేగాక మనకు కాస్త అదృష్టం కూడా కలిసిరావాలి. కానీ నా స్ట్రైక్ రేటు గురించి కొందరు మేధావులు మాట్లాడతారు అనుకుంటా'' అని రుతురాజ్ పేర్కొన్నాడు. దాదాపు 10 ఓవర్ల పాటు ఆడిన రుతురాజ్ 115 స్ట్రైక్రేటుతోనే పరుగులు సాధించాడు.