
21 పరుగులు పిండుకున్న జడేజా:
172 పరుగుల లక్ష్య ఛేదనలో చెన్నై సూపర్ కింగ్స్కు ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్ (40; 28 బంతుల్లో 2×4, 3×6), ఫాఫ్ డుప్లెసిస్ (43; 30 బంతుల్లో 7×4) మంచి ఆరంభం ఇచ్చారు. అనంతరం మొయిన్ అలీ (35; 28 బంతుల్లో 2×4, 2×6) ఫర్వాలేదనిపించాడు. దాంతో చెన్నై విజయం ఖాయమే అనుకున్నారు. అయితే ఈ ముగ్గురితో పాటు అంబటి రాయుడు (10), సురేష్ రైనా (11), ఎంఎస్ ధోనీ (1) ఔటవడంతో చివర్లో ఉత్కంఠ నెలకొంది. చెన్నై విజయానికి 12 బంతుల్లో 26 పరుగులు అవసరం అయ్యాయి. ఈ సమయంలో రవీంద్ర జడేజా మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. ప్రసిద్ధ్ వేసిన 19వ ఓవర్లో రెండు ఫోర్లు, 2 సిక్సులు బాది మొత్తంగా 21 పరుగులు పిండుకున్నాడు. సామ్ కరన్ కూడా మరో పరుగు తీశాడు. చివరి ఓవర్లో 4 పరుగులు అవసరం అవ్వగా.. రెండు వికెట్లు పడడంతో మ్యాచ్ చివరి బంతి వరకు సాగింది. దీపక్ చహర్ చివరి బంతికి ఒక పరుగు తీసి జట్టుకు విజయాన్ని అందించాడు.

దురదృష్టం కొద్దీ ఓటమిపాలయ్యాం:
మ్యాచ్ అనంతరం కోల్కతా నైట్ రైడర్స్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ మాట్లాడుతూ... 'ఈ మ్యాచులో భాగం కావడం సంతోషంగా ఉంది. రెండు జట్లూ అద్భుతంగా ఆడినా చెన్నై విజయం సాధించింది. అయితే ఈ రోజు మా ఆటలో ఏ ఆటగాడిని తప్పుపట్టాల్సిన అవసరం లేదు. అందరూ గెలిచేందుకు చాలా కష్టపడ్డారు. అయితే దురదృష్టం కొద్దీ ఓటమిపాలయ్యాం. రెండో దశలో మా జట్టు సానుకూలంగా ఆడుతోంది. ఈరోజు ఆటలో అలాంటి పరిణామాలనే ఎంచుకొని తర్వాతి మ్యాచ్ల్లో రాణించేందుకు ప్రయత్నిస్తాం. ప్లే ఆఫ్ చేరేందుకు మేము ప్రత్నిస్తాం. మా లక్ష్యం కూడా అదే' అని తెలిపాడు.

జడేజా అలా ఆడితే:
'సునీల్ నరైన్ ఏ జట్టు మీదైనా రాణించడానికి సిద్ధంగా ఉంటాడు. 19వ ఓవర్ను ఆండ్రీ రస్సెల్ లేదా సునీల్ నరైన్తో వేయించాలనుకున్నా. చివరకు నరైన్ చేతికి బంతిని ఇచ్చా. ఆ సమయంలో అతడి కన్నా మెరుగైన బౌలర్ దొరకడు. ఈ టోర్నీలో చాలా మంది నైపుణ్యమున్న ఆటగాళ్లు ఉన్నారు. అందులో కొందరు భారత యువ ఆటగాళ్లు ఉన్నారు. వారు ఇలాగే ఆడితే టీమిండియాకు ప్రాతినిధ్యం వహించే అవకాశం ఉంది. చెన్నై జట్టులోని రవీంద్ర జడేజా.. ఇంగ్లండ్ ఆటగాడు సామ్ కరన్లా ఆడితే ఏమీ చేయలేం. జడ్డు మంచి ప్రదర్శన చేశాడు. అయితే మా స్పిన్నర్లు కూడా మంచి ప్రదర్శన చేశారు' అని ఇయాన్ మోర్గాన్ చెప్పుకొచ్చాడు.

అద్భుతమైన మ్యాచ్:
'ఇది చాలా అద్భుతమైన విజయం. క్రికెట్లో కొన్నిసార్లు బాగా ఆడి మ్యాచ్ను కోల్పోతాం. మరికొన్ని సార్లు బాగా ఆడకపోయినా.. గెలుపొందుతాం. ఇలాంటప్పుడు ఇంకాస్త ఆనందం ఉంటుంది. ఈరోజు మాత్రం అద్భుతమైన మ్యాచ్ జరిగింది. కోల్కతా కూడా బాగా ఆడటంతో ఫాన్స్ మంచి ఆటను ఆస్వాదించారు. ఈ మ్యాచ్లో మా బౌలర్లు మంచి ప్రదర్శన చేశారు. అబుదాబిలో ఉక్కపోత తీవ్రత ఎక్కువ. ఇలాంటి పరిస్థితుల్లో ఫాస్ట్ బౌలర్లకు అంత తేలికకాదు. అందుకే వారితో ఒకటి, రెండు ఓవర్ల స్పెల్స్ వేయించా. ఈ వికెట్పై 170 పరుగులు మంచి స్కోరే. ఇలా వరుస విజయాలు సాధించడం బాగుంది' అని చెన్నై కెప్టెన్ ఎంఎస్ ధోనీ అన్నాడు.


Click it and Unblock the Notifications












