
అబుదాబి: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021లో భాగంగా అబుదాబి వేదికగా చెన్నై సూపర్ కింగ్స్తో జరుగుతున్న మ్యాచులో కోల్కతా నైట్ రైడర్స్ పోరాడే స్కోర్ చేసింది. కోల్కతా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 171 రన్స్ చేసి.. చెన్నై ముందు 172 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. ఇన్నింగ్స్ చివరలో కోల్కతా వికెట్ కీపర్ దినేష్ కార్తీక్ మెరుపులు మెరిపించాడు. 11 బంతుల్లో 3 ఫోర్లు, ఓ సిక్స్ సాయంతో 26 పరుగులు చేశాడు. రాహుల్ త్రిపాఠి (45; 33 బంతుల్లో 4x 4, 1x6), నితీష్ రాణా (37; 27 బంతుల్లో 3x 4, 1x6)లు పర్వాలేదనిపించారు. యువ బ్యాటర్ వెంకటేశ్ అయ్యర్ నిరాశపరిచాడు. చెన్నై బౌలర్లలో జోష్ హజిల్వుడ్, శార్దుల్ ఠాకూర్ తలో రెండు వికెట్లు పడగొట్టారు.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కోల్కతాకు ఇన్నింగ్స్ ఆరంభంలోనే భారీ ఎదురు దెబ్బ తగిలింది. ఓపెనర్ శుభమన్ గిల్ (9)ని అంబటి రాయుడు రనౌట్ చేశాడు. ఆ తర్వాత యువ బ్యాటర్ వెంకటేశ్ అయ్యర్ (18; 15 బంతుల్లో 3x 4)తో కలిసి త్రిపాఠి ఇన్నింగ్స్ని చక్కదిద్దాడు. సామ్ కరన్ వేసిన ఇన్నింగ్స్ నాలుగో ఓవర్లో త్రిపాఠి సిక్స్, ఫోర్ బాదాడు. హేజిల్ వుడ్ వేసిన తర్వాతి ఓవర్లో వెంకటేశ్ అయ్యర్ రెండు ఫోర్లు కొట్టాడు. దాంతో కోల్కతా స్కోర్ వేగం పెరిగింది. అయితే ఆరో ఓవర్ వేసిన శార్దూల్ ఠాకూర్.. వెంకటేశ్ అయ్యర్ని ఔట్ చేసి కోల్కతాను దెబ్బ కొట్టాడు.
వెంకటేశ్ అయ్యర్ ఔట్ అనంతరం కోల్కతా స్కోరు వేగం కాస్త నెమ్మదించింది. కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ (8) పూర్తిగా నిరాశపచాడు. ఆపై రవీంద్ర జడేజా వేసిన 13వ ఓవర్లో రాహుల్ త్రిపాఠి క్లీన్ బౌల్డయ్యాడు. అనంతరం ఆండ్రీ రసెల్ (20; 15 బంతుల్లో 2×4, 1×6) ధాటిగా పరుగులు చేశాడు. అయితే వేగంగా ఆడబోయి 17వ ఓవర్లో ఔటయ్యాడు. మరోవైపు నితీష్ రాణా మాత్రం వికెట్ కాపాడుకుంటూ పరుగులు చేశాడు. ఇక దినేశ్ కార్తీక్ ఇన్నింగ్స్ చివర్లో దూకుడుగా ఆడాడు. బౌండరీల మోత మోగించాడు. దీపక్ చాహర్ వేసిన 18వ ఓవర్లో రాణా రెండు ఫోర్లు బాదాడు. సామ్ కరన్ వేసిన 19వ ఓవర్లో దినేశ్ కార్తీక్ రెండు ఫోర్లు, ఓ సిక్స్ బాదాడు. జోష్ హేజిల్వుడ్ వేసిన చివరి ఓవర్లో కార్తీక్ ఔటయ్యాడు. దాంతో కోల్కతా 171 రన్స్ చేసింది.
ఐపీఎల్ టోర్నీలో ఇప్పటి వరకు చెన్నై సూపర్ కింగ్స్, కోల్కతా నైట్ రైడర్స్ జట్లు 26 మ్యాచుల్లో తలపడ్డాయి. ఇందులో చెన్నై16, కోల్కతా 9 మ్యాచుల్లో విజయం సాధించాయి. ఒక మ్యాచులో ఫలితం తేలలేదు. యూఏఈలో ఇప్పటి వరకు ఇరు జట్లు 2 మ్యాచుల్లో తలపడ్డాయి. ఇందులో చెన్నై, కోల్కతా తలో మ్యాచులో గెలిచాయి. పిచ్ విపరీతమైన తేమతో ఉంది. ఐపీఎల్ 2020లో ఈ వేదికపై మధ్యాహ్నం ఆటలలో మొదట బ్యాటింగ్ చేసే జట్ల సగటు స్కోరు 165గా నమోదైంది. ఇక్కడ ఓ మ్యాచ్ సూపర్ ఓవర్ వరకు కూడా వెళ్లింది.