చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ క్రేజ్ గురించి అందరికీ తెలిసిందే. హోమ్ గ్రౌండ్లోనే కాదు, దేశంలో ఎక్కడ ఐపీఎల్ మ్యాచ్ జరిగినా ఎల్లో జెర్సీలతో స్టేడియం కళకళలాడుతుంటుంది. ధోనీని చూడటం కోసం ఫ్యాన్స్ ఎగబడుతుంటారు. ఇక చెపాక్ స్టేడియంలో మ్యాచ్ అంటే స్టాండ్స్లో ఎల్లో జెర్సీలు, జెండాలు తప్ప మరేవి కనిపించవు.
ధోనీ మైదానంలో అడుగుపెట్టినా, బ్యాటు పట్టినా స్టేడియమంతా విజిల్స్, అరుపులతో దద్దరిల్లుతుంటుంది. అయితే కేకేఆర్తో జరిగిన మ్యాచ్లో ధోనీపై చూపిన అభిమానుల ప్రేమకు హిట్టర్ ఆండ్రీ రసెల్ తీవ్రంగా ఇబ్బందిపడ్డాడు. ధోనీ ఫ్యాన్స్ చేసిన అరుపులు, విజిల్స్ సౌండ్ను భరించలేక రసెల్ చెవులు మూసుకున్నాడు.

సీఎస్కే ఛేజింగ్ ఆఖర్లో ధోనీ బ్యాటింగ్కు వచ్చినప్పుడు ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ సమయంలో స్టేడియంలో ఫ్యాన్స్ చేసిన సౌండ్స్ 125 డెసిబెల్కు చేరుకోవడం గమనార్హం. బౌండరీలైన్లో ఫీల్డింగ్ చేస్తున్న రసెల్ ఈ శబ్ధాలను తట్టుకోలేక తన చెవులను కాపాడుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. ఈ సీజన్లో చెపాక్లో ధోనీ బ్యాటింగ్కు రావడం ఇదే తొలిసారి. మూడు బంతులను ఎదుర్కొన్న ధోనీ అజేయంగా ఒక్క పరుగుతో నిలిచాడు.
ఇక మ్యాచ్ విషయానికొస్తే..చెపాక్ వేదికగా నిన్న కోల్కతా నైట్ రైడర్స్తో జరిగిన మ్యాచ్లో సీఎస్కే ఆల్రౌండ్షో తో అదరగొట్టింది. ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్లకు 137 పరుగులు చేసింది. శ్రేయస్ అయ్యర్ (34; 32 బంతుల్లో, 3x4) సునీల్ నరైన్ (27; 20 బంతుల్లో, 3x4, 2x6) టాప్ స్కోరర్లు. రవీంద్ర జడేజా (3/18), తుషార్ దేశ్పాండే (3/33)చెరో మూడు వికెట్లతో సత్తాచాటారు.
అనంతరం ఛేదనలో సీఎస్కే 17.4 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ (67*; 58 బంతుల్లో, 9x4) జట్టును విజయతీరాలకు చేర్చాడు. శివమ్ దూబె (28; 18 బంతుల్లో, 1x4, 3x6), డారిల్ మిచెల్ (25; 19 బంతుల్లో, 1x4, 1x6) రాణించారు. కేకేఆర్ బౌలర్లలో వైభవ్ అరోరా (2/28) రెండు వికెట్లు తీశాడు.