CSK vs GT: డెవాల్డ్ బ్రెవిస్ మెరుపు ఇన్నింగ్స్ తర్వాత సీఎస్కే బౌలర్ల అద్భుతమైన ప్రదర్శన కారణంగా చెన్నై సూపర్ కింగ్స్ గుజరాత్ టైటాన్స్ను 83 పరుగుల తేడాతో ఓడించింది. ఈ విధంగా ఐదుసార్లు ఐపీఎల్ ఛాంపియన్ అయిన సీఎస్కే జట్టు ఐపీఎల్ 2025లో విజయంతో తన ప్రచారాన్ని ముగించింది. మరోవైపు గుజరాత్ టైటాన్స్ 20 పాయింట్లు సాధించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానాన్ని దక్కించుకునే అవకాశాన్ని కోల్పోయింది. ఈ సీజన్లో గుజరాత్ జట్టు 14 మ్యాచ్ల్లో 9 గెలిచి 18 పాయింట్లు సాధించింది. 18వ సీజన్లో ఇది సీఎస్కే జట్టుకు ఇది నాల్గవ విజయం మాత్రమే.
అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ క్రికెట్ స్టేడియంలో టాస్ గెలిచిన తర్వాత సీఎస్కే కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ముందుగా బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడు. ముందుగా బ్యాటింగ్ చేసిన సీఎస్కే నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 230 పరుగులు చేసింది. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన గుజరాత్ టైటాన్స్ 18.3 ఓవర్లలో 147 పరుగులకు ఆలౌట్ అయింది. ఈ విధంగా సీఎస్కే మ్యాచ్ను సులభంగా గెలిచింది.

పని చేయని సాయి సుదర్శన్, శుభ్మన్ గిల్ మాయాజాలం
ఐపీఎల్ 2025లో తమ బ్యాటింగ్తో సంచలనం సృష్టించిన కెప్టెన్ శుభ్మన్ గిల్, సాయి సుదర్శన్ సీఎస్కేపై ప్రత్యేకంగా ఏమి చేయలేకపోయారు. సీఎస్కేపై లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో గుజరాత్ తరఫున శుభ్మన్ గిల్ 9 బంతుల్లో 13 పరుగులు చేసి ఔటయ్యాడు. అయితే సాయి సుదర్శన్ 28 బంతుల్లో 41 పరుగులు చేయడం ద్వారా కొంతవరకు ఆశలు రేకెత్తించాడు. కానీ రవీంద్ర జడేజా అతడిని ఔట్ చేయడంతో గుజరాత్ జట్టు మ్యాచ్ నుంచి పూర్తిగా నిష్క్రమించింది. తన ఇన్నింగ్స్లో సాయి సుదర్శన్ 6 ఫోర్లు కొట్టాడు. ఒక్క సిక్స్ కూడా కొట్టలేదు. శుభ్మన్ గిల్ ఔటైన తర్వాత టాపార్డర్లో జోస్ బట్ల కేవలం 5 పరుగులు మాత్రమే చేయగలిగాడు. షర్పేన్ రూథర్ఫోర్డ్ తన ఖాతా కూడా తెరవలేకపోయాడు. ఈ విధంగా టాపార్డర్ కుప్పకూలిన తర్వాత గుజరాత్ టైటాన్స్ జట్టు ఓటమి అంచుకు చేరుకున్నట్లు కనిపించింది.
దీని తర్వాత షారుఖ్ ఖాన్ జట్టు కోసం కొన్ని మంచి షాట్లు ఆడాడు. కానీ షారుఖ్ ఖాన్ కేవలం 19 పరుగులు చేసిన తర్వాత రవీంద్ర జడేజా బౌలింగ్లో ఔటయ్యాడు. లోయర్ ఆర్డర్లో రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్ వంటి బ్యాటర్లు కూడా ప్రత్యేకంగా ఏమీ చేయలేకపోయారు. సీఎస్కే బౌలర్లలో నూర్ అహ్మద్, అన్షుల్ కాంబోజ్ తలో 3 వికెట్లు పడగొట్టగా.. రవీంద్ర జడేజా 2 వికెట్లు తీశాడు. ఖలీల్ అహ్మద్, మతిషా పతిరానా తలో వికెట్ పడగొట్టారు. ముఖ్యంగా రవీంద్ర జడేజా ఒకే ఓవర్లో రెండు వికెట్లు తీసి గుజరాత్ తీవ్రంగా దెబ్బతీశాడు.
దంచికొట్టిన సీఎస్కే బ్యాటర్లు
గుజరాత్ టైటాన్స్తో జరుగుతున్న ఆఖరి లీగ్ మ్యాచ్లో బ్యాటర్లందరూ అద్భుతంగా రాణించడంతో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు భారీ స్కోరు చేసింది. 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 230 పరుగులు చేసింది. గుజరాత్ జట్టు 231 పరుగులు భారీ లక్ష్యాన్ని ముందుంచింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సీఎస్కే జట్టు శుభారంభం లభించింది. ఓపెనర్లు ఆయుష్ మాత్రే, డెవాన్ కాన్వేలు అద్భుతంగా ఆడారు.
సీఎస్కే బ్యాటర్ ఆయుష్ మాత్రే విధ్వంసం సృష్టించాడు.ఒకే ఓవర్లో 28 పరుగులు బాదాడు. వచ్చిన బంతిని వచ్చినట్లు బౌండరీ దాటిస్తూ రెచ్చిపోయాడు. గుజరాత్ పేసర్ అర్షద్ ఖాన్ వేసిన ఇన్నింగ్స్ రెండో ఓవర్లో వరుసగా ఆరు బంతుల్లో 2,6,6,4,4,6 ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. అర్షద్ ఖాన్ ఓవర్లో ఏకంగా 28 పరుగులు రాబట్టాడు. ఆయుష్ మాత్రే ధాటికి చెన్నై సూపర్ కింగ్స్ 2 ఓవర్లలోనే 34 పరుగులు చేసింది. అర్షద్ బౌలింగ్ లో 3 సిక్సులు, 2 బౌండరీలు బాదాడు. ఆయుష్ మాత్రే మొత్తంగా 17 బంతుల్లో 34 పరుగులు చేశాడు. 200 స్ట్రైక్ రేట్ తో బ్యాటింగ్ చేస్తూ క్రీజులో ఉన్నంతసేపు గుజరాత్ జట్టును ఓ ఆట ఆడుకున్నాడు.
తన బ్యాటింగ్ తో అదరగొట్టిన ఆయుష్ మాత్రే.. ప్రసిద్ధ్ కృష్ణ బౌలింగ్లో సిరాజ్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్కు చేరాడు. ఆయుష్ మాత్రే ఔటైన తర్వాత ఉర్విల్ పటేల్ దంచికొట్టాడు. 19 బంతుల్లో 37 పరుగులు చేసి ఔటయ్యాడు. సాయి కిషోర్ వేసిన 10వ ఓవర్లో గుజరాత్ కెప్టెన్ శుభ్మన్ గిల్ కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ కు చేరుకున్నాడు. అనంతరం శివమ్ దూబే, డెవాన్ కాన్వేలు రెచ్చిపోయి ఇన్నింగ్స్ ను ముందుకు తీసుకెళ్తున్నట్లు కనిపించింది. కానీ శివమ్ దూబే 8 బంతుల్లో 17 పరుగులు చేసి ఔటయ్యాడు.చివర్లో డెవాల్డ్ బ్రెవిస్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. బ్రెవిస్ కేవలం 23 బంతుల్లోనే 4 ఫోర్లు, 5 సిక్సులతో 57 పరుగులు చేశాడు. కేవలం 19 బంతుల్లోనే అర్థ సెంచరీ సాధించాడు. రవీంద్ర జడేజా 18 బంతుల్లో ఒక ఫోర్, ఒక సిక్స్తో 21 పరగులు చేశాడు. గుజరాత్ టైటాన్స్ బౌలర్లలో ప్రసిద్ధ్ కృష్ణ 2 వికెట్లు పడగొట్టగా.. సాయి కిషోర్, రషీద్ ఖాన్, షారుక్ ఖాన్ తలో వికెట్ తీశారు.