హైదరాబాద్: ఎంఎస్ ధోనీ.. ఈ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు. భారత క్రికెట్లోనే కాకుండా ప్రపంచంలోనే అత్యంత విజయవంతమైన కెప్టెన్లలో ఒకడు. టీమిండియాకు తిరుగులేని విజయాలు ఎన్నో అందించాడు. టెస్టుల్లో టీమిండియాను అగ్రస్థానంలో నిలపడంతో పాటు.. టీ20 ప్రపంచకప్, వన్డే ప్రపంచకప్, ఛాంపియన్స్ ట్రోఫీలను భారత్కు అందించాడు. క్రికెట్ చరిత్రలో ఈ మూడు ఐసీసీ ట్రోఫీలు సాధించిన ఏకైక కెప్టెన్ ధోనీ మాత్రమే. ఇక ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో కూడా చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు మూడు టైటిల్స్ అందించాడు. తన సుదీర్ఘ క్రికెట్ కెరీర్లో ఎన్నో రికార్డులు నెలకొల్పిన ధోనీ తాజాగా మరో అరుదైన రికార్డు తన పేరుపై లికించుకున్నాడు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) చరిత్రలో 150 మందిని ఔట్ చేసిన తొలి వికెట్ కీపర్గా చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎంఎస్ ధోనీ సరికొత్త రికార్డు సృష్టించారు. ఐపీఎల్ 2021లో భాగంగా బుధవారం ముంబైలోని వాంఖడే స్టేడియంలో కోల్కతా నైట్ రైడర్స్తో జరిగిన మ్యాచ్లో మహీ ఈ ఫీట్ అందుకున్నాడు. కోల్కతా ఓపెనర్ నితీశ్ రాణా క్యాచ్ అందుకోవడం ద్వారా మహీ ఈ మైలురాయి చేరుకున్నాడు. ఐపీఎల్ లీగ్లో ధోనీ ఇప్పటి వరకు 111 క్యాచ్లు అందుకోగా.. 39 స్టంపౌట్లు చేశాడు. ధోనీ తర్వాత కోల్కతా వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్ ఈ జాబితాలో రెండో స్థానంలో ఉన్నాడు. కార్తీక్ ఇప్పటి వరకు 112 క్యాచ్లు, 31 స్టంపింగ్లు చేశాడు.
ఎంఎస్ ధోనీ ఐపీఎల్ టోర్నీలో 208 మ్యాచులు ఆడి 4667 రన్స్ చేశాడు. ఇందులో 23 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇక మహీకి ఐపీఎల్ 2021 చివరి సీజన్ కావచ్చన్న వార్తలు వస్తున్నాయి. అయితే చెన్నై సూపర్ కింగ్స్ సీఈవో కాశీ విశ్వనాథన్ మాత్రం ధోనీకి ఇదే చివరి సీజన్ కాదని ఇటీవల అన్నారు. 'మహీకి ఇదే చివరి ఏడాది అని నాకు అనిపించడం లేదు. ఇది నా వ్యక్తిగత అభిప్రాయం. మేము ఇప్పటికిప్పుడు మరో ప్లేయర్ వైపైతే చూడటం లేదు. ఇప్పటివరకు ధోనీ మాకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు' అని చెన్నై సీఈవో స్పష్టం చేశారు.
టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ గతేడాది ఆగష్టులో అంతర్జాతీయ క్రికెట్కు గుడ్ బై చెప్పాడు. అంతర్జాతీయ కెరీర్లో ధోనీ 90 టెస్ట్ మ్యాచ్ల్లో 4876 పరుగులు సాధించాడు. ఇందులో 6 సెంచరీలు, 33 అర్ధ శతకాలు ఉన్నాయి. 350 వన్డే మ్యాచ్ల్లో 10773 రన్స్ చేశాడు. వీటిల్లో 10 శతకాలతో పాటు 73 అర్థ శతకాలు ఉన్నాయి. వ్యక్తిగత అత్యధిక స్కోర్ 183. ఇక 98 టీ20 మ్యాచ్లలో 1600 పరుగుల బాదాడు.
2, 6, 6, 6, 4, 6: అరుదైన క్లబ్లో కమిన్స్.. గేల్, రైనా తర్వాత చోటు!!