
ధోనీ మాట వినని సామ్:
ఓ సాయంత్రం సమయాన ఫాంహౌస్లో ధోనీ, సాక్షి, జీవాలు సరదాగా గడిపారు. పెంపుడు శునకం సామ్ కూడా వారితో పాటే ఉంది. గార్డెన్లో సామ్ను క్యాచ్ పట్టమంటూ ధోనీ ఓ బాల్ను విసిరాడు. అయితే అది కనీసం కదలను కూడా కదలలేదు. కనీసం బాల వంక కూడా చూడలేదు. ఇదే సమయంలో 'నేను ఇక్కడ ఉన్నంతవరకు సామ్ నీ మాట వినదు' అంటూ సాక్షి మహీని ఆటపట్టించింది. అయితే మహీ మాత్రం అలా చూస్తూ ఉండిపోయాడు.
సాక్షి ఆజ్ఞను తూచా తప్పకుండా:
అనంతరం సామ్, సాక్షి ఆజ్ఞను తూచా తప్పకుండా పాటించింది. కూర్చోమన్నపుడు కూర్చోవటమే కాకుండా.. సాక్షి విసిరిన బంతిని అద్భుతంగా క్యాచ్ పట్టింది. మరోవైపు జీవా చెప్పిన మాట కూడా వినకుండా సామ్ అలా కూర్చుండిపోయింది. ఇంతలో సాక్షి వచ్చి.. సామ్ అలిసిపోయింది అని చెప్పింది. ఇక ఫాంహౌస్లో ఎవరో రాగా.. ధోనీ వారికి హాయ్ చెప్పాడు. ఆపై ధోనీ అక్కడి నుండి వెళిపోయాడు. ఈ సంఘటనకు సంబంధించిన సరదా వీడియోను చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తన ట్విటర్ ఖాతాలో షేర్ చేసింది. ఈ వీడియో నెట్టింట్లో వైరల్ అయింది.

కొత్త లుక్తో మాయ:
తాజాగా నెట్టింట్లో ధోనీ ఓ కొత్త లుక్తో దర్శనమిచ్చి ఆశ్చర్యానికి గురిచేశాడు. తన కూతురు జీవా సింగ్ ఇన్స్టాగ్రామ్ వేదికగా షేర్ చేసిన ఓ వీడియోలో ధోనీ తన ముద్దుల కుమార్తెతో, పెంపుడు కుక్కతో ఆహ్లాదంగా ఆటపాటలతో సమయం గడుపుతూ కనిపించాడు. సుమారు రెండు నిముషాలకు పైన సాగే ఈ వీడియోలో మహీ లుక్ నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటుంది. చాలా సింపుల్గా టీషర్ట్, లూజ్ ప్యాంట్లో నెరిసిన గడ్డంతో కనిపించాడు.

డైలమాలో ధోనీ భవిష్యత్తు:
2019 వన్డే ప్రపంచకప్ తర్వాత ఎంఎస్ ధోనీ టీమిండియాకి దూరమయ్యాడు. బీసీసీఐ సెలక్షన్కు కూడా అందుబాటులో ఉండడం లేదు. మహీ స్థానంలో రిషబ్ పంత్, కేఎల్ రాహుల్కి భారత సెలక్టర్లు వరుసగా అవకాశాలిచ్చారు. ఈ ఇద్దరిలో పంత్ ఫెయిలవగా.. రాహుల్ వన్డే, టీ20ల్లో వికెట్ కీపర్-బ్యాట్స్మెన్గా రాణించాడు. కరోనా వైరస్ కారణంగా ఐపీఎల్ 2020 నిరవధిక వాయిదా పడింది. దీంతో ధోనీ ప్రొఫెషనల్ క్రికెట్లోకి తిరిగి రావడాన్ని ఆలస్యం చేసింది. ఐపీఎల్లో మహీ బాగా రాణించినట్లయితే.. అక్టోబర్-నవంబర్లో జరిగే టీ20 ప్రపంచకప్ ఆడే అవకాశం ఉండేది. కానీ పరిస్థితి ఇప్పుడు అలా లేదు. దీంతో ధోనీ అంతర్జాతీయ క్రికెట్ భవిష్యత్తు డైలమాలో పడింది.


Click it and Unblock the Notifications












