పాపం రుతురాజ్ గైక్వాడ్.. సెంచరీని చేజార్చుకున్నాడు. అయితేనేం కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడి సన్రైజర్స్ హైదరాబాద్కు 213 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించాడు. చెపాక్ వేదికగా జరుగుతున్న మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 212 పరుగులు చేసింది. రుతురాజ్ గైక్వాడ్ (98; 54 బంతుల్లో, 10x4, 3x6) తృటిలో శతకాన్ని కోల్పోయాడు. డారిల్ మిచెల్ (52; 32 బంతుల్లో, 7x4, 1x6), శివమ్ దూబె (39*; 20 బంతుల్లో, 1x4, 4x6) కీలక ఇన్నింగ్స్ ఆడారు.
టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన సీఎస్కేకు శుభారంభం దక్కలేదు. అజింక్య రహానె (9; 12 బంతుల్లో, 1x4) తన పేలవ ఫామ్ను కొనసాగించాడు. భువనేశ్వర్ బౌలింగ్లో షాబాజ్ అహ్మద్ చేతికి చిక్కాడు. అనంతరం వన్డౌన్లో బ్యాటింగ్కు వచ్చిన డారిల్ మిచెల్తో కలిసి రుతురాజ్ ఇన్నింగ్స్ చక్కదిద్దాడు. మొదట మిచెల్ నిలకడగా ఆడినా, రుతురాజ్ దూకుడుగా ఆడటంతో పవర్ప్లేలో చెన్నై 50 పరుగులు చేసింది.

పవర్ ప్లే అనంతరం డారిల్ మిచెల్ క్రమంగా గేర్ మార్చాడు. అతనికి రుతురాజ్ కూడా తోడవ్వడంతో స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. వీరిద్దరు ఓవర్కు సగటున 10 పరుగులు సాధించారు. ఈ క్రమంలో రుతురాజ్ 27 బంతుల్లో, మిచెల్ 29 బంతుల్లోనే హాఫ్ సెంచరీ సాధించారు.
అయితే అర్ధశతకం సాధించిన వెంటనే మిచెల్ ఔటయ్యాడు. ఉనద్కత్ బౌలింగ్లో భారీ షాట్కు యత్నించి నితీశ్ రెడ్డి చేతికి చిక్కాడు. వీరిద్దరు రెండో వికెట్కు 64 బంతుల్లో 107 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. మిచెల్ ఔటైన అనంతరం రుతురాజ్ మరింత చెలరేగిపోయాడు. 15వ ఓవర్లో భువనేశ్వర్ బౌలింగ్లో వరుసగా సిక్సర్, ఫోర్ బాదాడు. తర్వాత వేసిన కమిన్స్ ఓవర్లో వరుసగా రెండు ఫోర్లు బాది 89 స్కోరుకు చేరుకున్నాడు.
కానీ ఆ తర్వాత రుతురాజ్కు స్ట్రైకింగ్ ఎక్కువగా లభించలేదు. అతను సింగిల్స్కే పరిమితమయ్యాడు. మరో ఎండ్లో ఉన్న శివమ్ దూబె సిక్సర్లతో హోరెత్తించాడు. నటరాజన్ వేసిన 17వ ఓవర్లో దూబె రెండు సిక్సర్లు బాదడంతో 17 పరుగులు వచ్చాయి. దూబె ధాటికి కమిన్స్ వేసిన 18వ ఓవర్లోనూ 16 పరుగులు వచ్చాయి.
అయితే చివరి రెండు ఓవరల్లో రుతురాజ్కు అవకాశం లభించినప్పటికీ బౌండరీ సాధించలేకపోయాడు. ఆఖరి ఓవర్లో నటరాజన్ బౌలింగ్లో భారీ షాట్కు యత్నించి నితీశ్ చేతికి చిక్కి రుతురాజ్ సెంచరీని చేజార్చుకున్నాడు. కాగా, ధోనీ రెండు బంతులు ఎదుర్కొని అజేయంగా అయిదు పరుగులు చేశాడు. హైదరాబాద్ బౌలర్లలో భువనేశ్వర్, నటరాజన్, ఉనద్కత్ తలో వికెట్ తీశారు.