చెన్నై: టీమిండియా మాజీ కేప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ రథ సారథి మహేంద్ర సింగ్ ధోనీకి ఉన్న మాస్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకించి చెప్పుకోనక్కర్లేదు. ఓ స్టార్ హీరోకు ఏ మాత్రం తగ్గని రేంజ్లో అభిమానులను సంపాదించుకున్నారు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వంటి ఒకరిద్దరు మినహా ఆ స్థాయిలో ఫ్యాన్ బేస్ మరో క్రికెటర్కు లేదు. ప్రత్యేకించి దక్షిణాది రాష్ట్రాల్లో ఆయనకు ఉన్న క్రేజ్, ఇమేజ్ వేరు.
అలాంటి ఎంఎస్ ధోనీ- ఫిల్మ్ ఇండస్ట్రీలో అడుగు పెట్టారు. ఇదివరకే ఫిల్మ్ ప్రొడక్షన్ హౌస్ను ప్రారంభించిన ఆయన తాజాగా తన కొత్త ప్రాజెక్ట్ను పట్టాలెక్కించారు. ఎంఎస్ ధోనీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ కింద తమిళంలో తొలి సినిమాను నిర్మిస్తోన్నారు. ఈ ఫిల్మ్ ప్రొడక్షన్ హౌస్కు ధోనీ భార్య సాక్షి సింగ్ మేనేజింగ్ డైరెక్టర్గా వ్యవహరిస్తోన్నారు.

రమేష్ తమిళ్మణి దర్శకత్వంలో తెరకెక్కుతోంది మూవీ.ఆయన రాసిన అథర్వ - ది ఆరిజిన్ అనే న్యూ ఏజ్ గ్రాఫిక్ నవల ఆధారంగా ఎంఎస్ ధోనీ- తన ఫిల్మ్ ప్రొడక్షన్ హౌస్ కింద మొట్టమొదటి సినిమాను తెరకెక్కిస్తోన్నారు. ఈ మూవీ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఉంటుందని కోలీవుడ్ టాక్. హరీష్ కల్యాణ్, ఇవానా, నదియా, యోగి బాబు.. లీడ్ క్యారెక్టర్లు చేస్తోన్నారు.
ఎల్జీఎం- లెట్స్ గెట్ మ్యారీడ్ అనేది ఈ మూవీ టైటిల్. దీని ఫస్ట్ లుక్ ఇవ్వాళ విడుదల కానుంది. ఈ సాయంత్రం 7 గంటలకు ఎంఎస్ ధోనీ ఫస్ట్ లుక్ను ఆవిష్కరించనున్నారు. దాదాపు షూటింగ్ ముగిసినట్టే. ఈ వేసవిలో సినిమాను విడుదల చేయాలని యూనిట్ భావిస్తోంది. ఐపీఎల్ సీజన్ ముగిసిన తరువాత ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకుని రావొచ్చని తెలుస్తోంది.
ప్రస్తుతం ధోనీ సారథ్యంలో చెన్నై సూపర్ కింగ్స్ ఐపీఎల్ మ్యాచ్లను ఆడుతోన్న విషయం తెలిసిందే. ఇప్పటి వరకు మూడు మ్యాచ్లను ఆడిన సీఎస్కే రెండింట్లో విజయఢంకా మోగించింది. తొలి మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్తో ఓడిన ఈ టీమ్.. ఆ తరువాత వరుసగా లక్నో సూపర్ జెయింట్స్, ముంబై ఇండియన్స్ను మట్టి కరిపించింది. పాయింట్ల పట్టికలో ప్రస్తుతం అయిదో స్థానంలో నిలిచింది.
బుధవారం తన తదుపరి మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ను ఢీ కొట్టాల్సి ఉంది. చెన్నై చెపాక్లోని ఎంఏ చిదంబరం స్టేడియంలో సాయంత్రం 7:30 గంటలకు మ్యాచ్ మొదలవుతుంది. రాజస్థాన్ రాయల్స్ కూడా మూడు మ్యాచ్లల్లో రెండింట్లో విజయం సాధించింది చెన్నై సూపర్ కింగ్స్ కంటే మెరుగైన రన్రేట్ ఉండటం వల్ల పాయింట్ల పట్టికలో టాప్ పొజీషన్లో కొనసాగుతోంది.