ఐపీఎల్-2024లో మరో ఆసక్తికర సమరానికి రంగం సిద్ధమైంది. అత్యధిక టైటిళ్లు సాధించిన ముంబై ఇండియన్స్ - చెన్నై సూపర్ కింగ్స్ ఇవాళ తలపడనున్నాయి. వాంఖడే వేదికగా జరగనున్న ఈ హైవోల్టేజ్ మ్యాచ్ ఆదివారం రాత్రి 7.30 గంటలకు ప్రారంభం కానుంది. గత 16 సీజనల్లో ఇరు జట్లు కలిసి ఏకంగా పది టైటిళ్లు సాధించిన విషయం తెలిసిందే. చెరో అయిదు సార్లు ఛాంపియన్గా నిలిచి రికార్డు సృష్టించాయి.
ఐపీఎల్-2024 లీగ్ స్టేజ్లో ముంబై, చెన్నై ఒక్కసారి మాత్రమే పోటీపడనున్నాయి. దీంతో ఈ మ్యాచ్పై అంచనాలు భారీగా పెరిగాయి. అయితే ముంబై ఇండియన్స్తో జరగనున్న ఇవాళ మ్యాచ్కు సీఎస్కే స్టార్ బౌలర్ పతిరన ఆడే అవకాశాలు తక్కువగా ఉన్నాయని ఆ జట్టు కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ పేర్కొన్నాడు. గాయం కారణంగా పతిరన సన్రైజర్స్ హైదరాబాద్, కోల్కతా నైట్ రైడర్స్తో జరిగిన మ్యాచ్లకు దూరమైన విషయం తెలిసిందే.

అయితే ముంబై మ్యాచ్కు పతిరన అందుబాటులోకి వస్తాడని సీఎస్కే మేనేజ్మెంట్ భావించింది. కానీ అతడు పూర్తిగా కోలుకోలేదని ఫ్లెమింగ్ సంకేతాలిచ్చాడు. ''మేం అనుకున్న తీవ్రగాయంతో పతిరన లేడు. ఒకవేళ ఇవాళ ముంబై ఇండియన్స్తో మ్యాచ్లో అతడు దూరమైనా, తర్వాత పోరులకు పతిరన సిద్ధంగా ఉంటాడని భావిస్తున్నాం. ఇలాంటి ప్రధాన మ్యాచ్ల్లో అతడు ఎంతో కీలకమని మాకు తెలుసు. కానీ అతడు 100 శాతం ఫిట్గా ఉండాలి'' అని సీఎస్కే కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ పేర్కొన్నాడు.
ఈ సీజన్లో అయిదు మ్యాచ్లు ఆడిన సీఎస్కే మూడు విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో కొనసాగుతోంది. మరోవైపు ముంబై ఇండియన్స్ రెండు మ్యాచ్ల్లో నెగ్గి, ఏడో స్థానంలో ఉంది. హ్యాట్రిక్ ఓటముల తర్వాత ముంబై తిరిగి గెలుపు బాట పట్టింది. ఓవరాల్గా ఐపీఎల్లో ఇప్పటివరకు ముంబై, చెన్నై 36 సార్లు తలపడ్డాయి. ముంబై ఇండియన్స్ 20 మ్యాచ్ల్లో నెగ్గగా, సీఎస్కే 16 మ్యాచ్ల్లో గెలిచింది. అయితే 2022 నుంచి చెన్నైదే పైచేయి. గత రెండు సీజన్లలో ఇరు జట్ల మధ్య జరిగిన నాలుగు మ్యాచ్ల్లో చెన్నై మూడింట్లో గెలిచింది.