ఐపీఎల్ ట్రోఫీ కోసం మరోసారి గుజరాత్తో పోటీ పడేందుకు చెన్నై టీం రెడీ అయింది. అహ్మదాబాద్ వేదికగా జరిగే ఈ ఫైనల్లో కూడా చెన్నై టీంలో ఎలాంటి మార్పులూ చేయకూడదని ధోనీ అనుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ సీజన్ ఆరంభం నుంచి ఫెయిలవుతున్నా కూడా అంబటి రాయుడుకు మరో అవకాశం ఇవ్వాలని అతను డిసైడ్ అయ్యాడట.
అంతకుముందు చెపాక్ వేదికగా జరిగిన తొలి క్వాలిఫైయర్లో కూడా ఈ రెండు జట్లు తలపడ్డాయి. ఆ మ్యాచ్లో ధోనీ తెలివైన వ్యూహాల ముందు గుజరాత్ తేలిపోయింది. అయితే ఈసారి సొంత మైదానంలో ఎలాగైనా గెలిచి, తమ టైటిల్ కాపాడుకోవాలని గుజరాత్ అనుకుంటోంది. దానికితోడు సొంత మైదానంలో గిల్ ఫామ్ కూడా వారికి కలిసొచ్చే అవకాశం ఉంది.

ఈ రెండు జట్లు తలపడిన తొలి క్వాలిఫైయర్లో కూడా రాయుడు పెద్దగా ఆకట్టుకోలేదు. కానీ అతని స్థానాన్ని భర్తీ చేసేందుకు మరో ప్లేయర్ లేకపోవడంతో చెన్నై టీం అతనికే ఓటు వేసే అవకాశం కనిపిస్తోంది. ఇక ఈ సీజన్లో చెన్నై అభిమానులను నిరాశ పరిచిన మరో ప్లేయర్ మహీష్ తీక్షణ. అయితే అతను ప్లేఆఫ్స్కు ముందు రెండు మ్యాచుల నుంచి రాణిస్తున్నాడు.
మొదటి క్వాలిఫైయర్లో కూడా రెండు వికెట్లతో రాణించాడీ శ్రీలంక స్పిన్నర్. దీంతో అతను ఈ మ్యాచ్లో కూడా కీలకం కానున్నాడు. ఇక చెన్నై ఓపెనర్లపై మరోసారి తీవ్రమైన భారం పడనుంది. ఇక్కడ కాన్వే, గైక్వాడ్ ఇచ్చే ఆరంభంపై చెన్నై విజయావకాశాలు ఆధార పడి ఉంటాయి. ఒకవేళ ఛేజింగ్ చేయాల్సి వచ్చినా వారిద్దరిపైనే ఎక్కువ భారం పడుతుంది.
ఇలాంటి క్రమంలో జట్టులో పెద్దగా మార్పులు చేయకూడదని ధోనీ అనుకుంటున్నట్లు సమాచారం. సాధారణంగానే జట్టులో మార్పులు చేయడం ధోనీకి నచ్చదు. ఈ క్రమంలో ఫైనల్ మ్యాచ్లో కూడా మార్పుల్లేని జట్టుతోనే గుజరాత్ను ఢీకొట్టేందుకు కెప్టెన్ కూల్ రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది.
చెన్నై జట్టు (అంచనా): డెవాన్ కాన్వే, రుతురాజ్ గైక్వాడ్, అజింక్య రహానే, మొయీన్ అలీ, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోనీ (కెప్టెన్), దీపక్ చాహర్, మతీష పతిరాణా, మహీష్ తీక్షణ, తుషార్ దేశ్పాండే