
ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021లో చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) ఇప్పటికే ప్లే ఆఫ్స్లో అడుగుపెట్టింది. మరో మూడు మ్యాచ్లు మిగిలి ఉండగానే.. 18 పాయింట్లతో అధికారిక బెర్త్ దక్కించుకుంది. 11 మ్యాచ్ల్లో తొమ్మిది విజయాలతో చెన్నై ఈ సీజన్లో ప్లే ఆఫ్స్ చేరిన తొలి జట్టుగా నిలిచింది. షార్జా వేదికగా గురువారం సన్రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్)తో జరిగిన మ్యాచులో 6 వికెట్ల తేడాతో చెన్నై గెలుపొందింది. హైదరాబాద్ నిర్దేశించిన 135 పరుగుల లక్ష్యాన్ని చెన్నై 19.4 ఓవర్లలో ఛేదించింది. ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్ (45; 38 బంతుల్లో 4×4, 2×6), ఫాఫ్ డుప్లెసిస్ (41; 36 బంతుల్లో 3×4, 2×6).. తెలుగు తేజం అంబటి రాయుడు (17 నాటౌట్; 13 బంతుల్లో 1×4, 1×6) జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు.
అయితే ఐపీఎల్ 2021లో సీఎస్కే ప్రదర్శన ఎలా ఉన్నా.. కెప్టెన్ ఎంఎస్ ధోనీ మాత్రం బ్యాటింగ్లో విఫలమవుతున్నాడు. దీంతో మాజీల నుంచి పలు విమర్శలు ఎదుర్కొంటున్నాడు. ఈ నేపథ్యంలోనే భారత మాజీ ఓపెనర్, వ్యాఖ్యాత ఆకాశా చోప్రా ధోనీ ఆట తీరుపై పంచులు వేశాడు. ప్రస్తుతం చెన్నై 10 మంది ప్లేయర్స్, ఓ కెప్టెన్తో ఆడుతోందన్నాడు. ధోనీ బ్యాటింగ్లో లోయర్ ఆర్డర్లో రావడం, అతడి బ్యాటింగ్తో జట్టుకు ఎలాంటి ప్రయోజనం లేకపోవడం వల్లే ఆకాశ్ చోప్రా ఈ కామెంట్స్ చేశాడు. ధోనీ ఓ బ్యాటర్గా ఉన్నా.. లేనట్టే అని ప్రస్తుత సీజన్లో ఇప్పటివరకు 11 మ్యాచ్లు ఆడిన మహీ 11.40 పేలవ సగటుతో కేవలం 66 పరుగులు మాత్రమే సాధించాడు.
తాజాగా తన యూట్యూబ్ ఛానెల్లో మాట్లాడుతూ ఆకాశ్ చోప్రా మాట్లాడుతూ... 'ఎంఎస్ ధోనీ ఓ కెప్టెన్, వికెట్ కీపర్గా మాత్రమే చెన్నై జట్టుకు సేవలందిస్తున్నాడు. ఎందుకంటే బ్యాటింగ్ ఆర్డర్లో ధోనీ దిగువన ఆడుతున్నాడు. కొన్ని సార్లు ముందుగా బ్యాటింగ్ వచ్చినా.. ఏ మాత్రం ఆకట్టుకోలేకపోతున్నాడు. దీనిని బట్టి గమనిస్తే ప్రస్తుతం చెన్నై 10 మంది ప్లేయర్స్, ఓ కెప్టెన్తో ఆడుతోంది' అని సెటైర్ వేశాడు. అయితే అలాగే కెప్టెన్గా ధోనీ జట్టును నడిపిస్తున్న తీరుపై ఆకాష్ ప్రశంసల వర్షం కురిపించాడు. 'గతేడాది విఫలమైన చెన్నై ఈసారి పుంజుకుంది. వరుస విజయాలు సాధిస్తోంది. దీనికంతటికీ కారణం ధోనీ కెప్టెన్సీనే. ఇందులో ఎలాంటి సందేహం లేదు. ఒకవేళ మహీ కనుక జట్టులో లేకపోతే ఇలాంటి ఫలితాలు వచ్చేవి కావు' అని తెలిపాడు.
ఈ మ్యాచులో సీఎస్కే కెప్టెన్ ఎంఎస్ ధోనీ అరుదైన ఘనత సాధించాడు. ఐపీఎల్ ఆరంభం (మధ్యలో ఒక సీజన్ మినహా) నుంచి చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకే ఆడుతున్న ధోనీ.. వికెట్ కీపర్గా 100 క్యాచ్లు అందుకున్నాడు. వికెట్ కీపర్ వృద్దిమాన్ సాహా క్యాచ్ అందుకోవడం ద్వారా మహీ ఈ ఘనతను అందుకున్నాడు. ధోనీ తర్వాత ఒకే జట్టుకు ఆడుతున్న జాబితాలో సీఎస్కే స్టార్ బ్యాటర్, మిస్టర్ ఐపీఎల్ సురేష్ రైనా రెండో స్థానంలో ఉన్నాడు. రైనా 98 క్యాచ్లు అందుకున్నాడు. ముంబై ఇండియన్స్ స్టార్ ప్లేయర్ కీరన్ పొలార్డ్ 94 క్యాచ్లతో మూడో స్థానంలో కొనసాగుతున్నాడు.