
ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021 వేలంలో తెలుగు ఆటగాడు హనుమ విహారిని ఏదో ఒక ఫ్రాంచైజీ కొనుగోలు చేసి ఉంటే బాగుండేదని టీమిండియా టెస్ట్ స్పెసలిస్ట్ చతేశ్వర్ పుజారా అభిప్రాయపడ్డాడు. విహారిని తలుచుకుంటే చాలా బాధగా ఉందని పేర్కొన్నాడు. దాదాపు ఏడేళ్ల తర్వాత పుజారా ఐపీఎల్లో ఆడుతున్న విషయం తెలిసిందే. గత ఫిబ్రవరిలో జరిగిన మినీ వేలంలో రూ. 50 లక్షలకు చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) కొనుగోలు చేసింది. దీంతో పుజారా ఎప్పుడెప్పుడు ఐపీఎల్లో ఆడాలా అని ఎదురుచూస్తున్నాడు.
తాజాగా ఈఎస్పీఎన్-క్రిక్ఇన్ఫోతో చతేశ్వర్ పుజారా మాట్లాడాడు. 'మనం టీమిండియా జట్టుకు ఏదైనా సాధించినప్పుడు ప్రజలు అమితంగా ఇష్టపడడం సాధారణం. ఆ విలువ ఎలా ఉంటుందనేది నాకు తెలుసు. ఇప్పుడు నేను ఐపీఎల్లో ఆడుతున్నందుకు ఎంత సంతోషంగా ఉన్నానో నా సహచరులు కూడా అంతే ఆనందంతో ఉన్నారు. గత కొన్నేళ్లలో టీమింయాలో ఉన్న సహచరుల్లో ఐపీఎల్ మిస్సయ్యింది నేను మాత్రమే అనుకుంటా. దాదాపు ఏడేళ్ల తర్వాత ఐపీఎల్లో ఆడబోతున్నా. తాజాగా హనుమ విహారి ఆ బాధను అనుభవిస్తున్నాడు' అని అన్నాడు.
'2018 తర్వాత హనుమ విహారిని ఏ జట్టు వేలంలో తీసుకోవడానికి ముందుకు రాలేదు. కానీ అతను ఐపీఎల్లో ఏదో ఒక జట్టుకు ఆడి ఉంటే బాగుండేది. గతంలో విహారి ఐపీఎల్లో ఆడాడు.. ఇప్పుడు కూడా ఉంటే బాగుంటుంది' అని చతేశ్వర్ పుజారా అభిప్రాయపడ్డాడు. విహారి గతంలో ఐపీఎల్లో సన్రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ క్యాపిటల్స్కు ప్రాతినిధ్యం వహించాడు. 2019లో సన్రైజర్స్ విహారిని రిలీజ్ చేసిన తర్వాత అతన్ని కొనుగోలు చేయడానికి ఏ ఫ్రాంచైజీ ఆసక్తి చూపించలేదు.
ఇక చివరిసారి 2014లో కింగ్స్ పంజాబ్ తరఫున ఆడిన చతేశ్వర్ పుజారా.. 2011 నుంచి 2013 వరకూ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకి ప్రాతినిథ్యం వహించాడు. ఏడేళ్ల నుంచి ప్రతీసారి వేలంలో తన పేరును నమోదు చేసుకుంటున్నా.. ఏ ఫ్రాంచైజీ ఆసక్తికనబరచలేదు. తాను టెస్టు ప్లేయర్నే కాదని, అన్ని ఫార్మాట్లు ఆడే సత్తా ఉందని పదేపదే మొత్తుకున్నా.. పుజారాను ఎవరూ పట్టించుకోలేదు. ఆఖరికి సీఎస్కే తీసుకోవడంతో పుజారా తన ఆటకు పదును పెట్టే పనిలో పడ్డాడు. ఇప్పటికే చెన్నై శిబిరంలో చేరి ముమ్ముర సాధన చేస్తున్నాడు. తాజాగా ప్రాక్టీస్ సమయంలోనూ పుజారా సిక్సర్ల వర్షం కురిపించి తనలో ఎంత కసి దాగుందో చూపించాడు. అయితే అతనికి సీఎస్కే అవకాశాలు ఇస్తుందా అన్న అనుమానం ఉన్నా.. చాన్స్ ఇస్తే మాత్రం తన విలువేంటో చూపించేందుకు ఉత్సుకతతో ఉన్నాడు.