చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ పేసర్ ముకేశ్ చౌదరి తిరిగి జట్టుతో చేరాడు. గతేడాది కాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ముంబైలోని టాటా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ముకేశ్ చౌదరి తల్లి ప్రేమ్ దేవి.. మంగళవారం(ఏప్రిల్ 21) రోజున తుదిశ్వాస విడిచారు. రాజస్థాన్లోని భిల్వారాలో ఆమె అంత్యక్రియలు నిర్వహించగా.. ముకేశ్ వాటిని ముగించుకుని బుధవారం రాత్రి జట్టులో చేరినట్లు సమాచారం.
ధోనీ అండ.. ఆస్పత్రికి వెళ్లి మరీ పరామర్శ
ముకేశ్ చౌదరి వ్యక్తిగత విషాదంలో ఉన్న సమయంలో సీఎస్కే మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ ముకేశ్ చౌదరికి అండగా నిలిచాడు. ముకేశ్కు మానసిక ధైర్యం ఇవ్వడమే కాకుండా.. ధోనీ వ్యక్తిగతంగా ఆస్పత్రికి వెళ్లి ముకేశ్ తల్లిని పరామర్శించినట్లు సమాచారం. సీఎస్కే యాజమాన్యం కూడా ముకేశ్ పట్ల మానవత్వంతో వ్యవహరించి అతనికి కావాల్సిన సమయాన్ని కేటాయించింది.

హైదరాబాద్ మ్యాచ్ తర్వాత వెళ్లిన ముకేశ్
సన్రైజర్స్ హైదరాబాద్తో జరిగిన మ్యాచ్ తర్వాత ముకేశ్ చౌదరి నేరుగా తన స్వగ్రామం భిల్వారాకు వెళ్లాడు. ఆ మ్యాచ్ లో చెన్నై ఓటమి పాలైనప్పటికీ.. ముకేశ్ తన బౌలింగ్తో ఆకట్టుకున్నాడు. ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్ వంటి విధ్వంసకర బ్యాటర్లను వరుస బంతుల్లో ఔట్ చేసి సత్తా చాటాడు. ఐపీఎల్ 2026 సీజన్లో అతను ఆడిన ఏకైక మ్యాచ్ ఇదే కావడం గమనార్హం.
ముంబైతో మ్యాచ్కు సిద్ధం
ఖలీల్ అహ్మద్ గాయం కారణంగా ఈ సీజన్ మొత్తానికి దూరం కావడంతో ముకేశ్ చౌదరి తిరిగి రావడం సీఎస్కే బౌలింగ్ విభాగానికి పెద్ద ఊరట. నేడు (ఏప్రిల్ 23) వాంఖడే స్టేడియంలో ముంబై ఇండియన్స్తో జరగనున్న హై-వోల్టేజ్ మ్యాచ్లో ముకేశ్ ఆడే అవకాశం ఉంది. అయితే ఈ మ్యాచ్కు సంబంధించి మరో ఆందోళనకరమైన వార్త ఏమిటంటే.. రోహిత్ శర్మ, ఎంఎస్ ధోనీ ఇద్దరూ గాయాల కారణంగా ఈ పోరుకు దూరం అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.
ముకేశ్ చౌదరి స్వతహాగా రాజస్థాన్కు చెందినవాడైనప్పటికీ.. మహారాష్ట్ర తరపున దేశవాళీ క్రికెట్ ఆడుతున్నాడు. 2022లో తన అరంగేట్రం సీజన్లోనే 16 వికెట్లు తీసి అందరి దృష్టిని ఆకర్షించాడు. మధ్యలో గాయాల వల్ల ఇబ్బంది పడినా.. సీఎస్కే జట్టు ముకేశ్ చౌదరిపై నమ్మకం ఉంచి ఈ సీజన్లో కూడా కొనసాగిస్తోంది. తన తల్లి మరణించిన బాధలో ఉన్నప్పటికీ.. జట్టు ప్రయోజనాల కోసం అతను తిరిగి రావడం చూసి అభిమానులు అతనికి మద్దతు తెలుపుతున్నారు.