
ఆగస్టు 15న వీడ్కోలు:
గతేడాది ఆగస్టు 15న ఎంఎస్ ధోనీ అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో మహీ ఐపీఎల్ 2020 కోసం సన్నద్ధమవుతున్నాడు. చిదంబరం మైదానంలో చెన్నై సూపర్ కింగ్స్ ప్రాంచైజ్ ఏర్పాటు చేసిన సన్నాహక శిబిరంలో సాధన చేస్తున్నాడు. ధోనీ వీడ్కోలు ప్రకటన చేస్తాడని నిజానికి ఎవ్వరూ ఊహించలేదు. ఉన్నపళంగా సాయంత్రం సోషల్ మీడియాలో అంతర్జాతీయ క్రికెట్ ఇకపై ఆడను అనే విషయం వీడియో రూపంలో తెలియజేశాడు. ఆ వెంటనే టీమిండియా వెటరన్ ఆటగాడు, మిస్టర్ ఐపీఎల్ సురేశ్ రైనా కూడా రిటైర్మెంట్ ప్రకటించి మరో షాక్ ఇచ్చాడు.

రిటైర్మెంట్ గురించి ఎవరికీ తెలియదు:
తాజాగా రుతురాజ్ గైక్వాడ్ మాట్లాడుతూ... 'ఆ రోజు (ఆగస్టు 15న) ఐపీఎల్ 2020 మేం దుబాయ్కు బయల్దేరాలి. చెన్నైలో ఎంఎస్ ధోనీతో 10-15 మంది కలిసి సాధన చేశారు. కానీ అందులో ఎవరికీ మహీ భాయ్ రిటైర్మెంట్ గురించి తెలియదు. ఆ రోజు సైతం మిగతా రోజుల్లాగే మామూలుగానే గడిచింది. సీఎస్కేలోని ఇతర ఆటగాళ్లలాగా నాకూ సోషల్ మీడియా ద్వారానే ధోనీ వీడ్కోలు గురించి తెలిసింది. ఒక్కసారిగా షాక్ అయ్యాం. మొదటి నమ్మలేదు. కానీ రిటైర్మెంట్ స్టేట్మెంట్ చూసాక నిజమని నమ్మాము' అని తెలిపాడు.

మూడు రోజుల సమయం పట్టింది:
'ఆ రోజు సాయంత్రం చిదంబరం మైదానంలో 6:30కి సాధన ముగిసింది. మహీభాయ్ తప్ప మిగతా అందరం 7 గంటలకు భోజనం వద్ద కూర్చున్నాం. ఇన్స్టాగ్రామ్ వేదికగా మహీ వీడ్కోలు పలికాడని ఎవరో చెప్పారు. భయంతో ఈ విషయం గురించి ఎవరూ మాట్లాడుకోలేదు. ధోనీ వీడ్కోలు గురించి తెలియగానే ఇకపై అతడిని అంతర్జాతీయ క్రికెట్లో చూడలేమని నా మదిలో మెదిలింది. అది అర్థమవ్వడానికి రెండుమూడు రోజుల సమయం పట్టింది' అని రుతురాజ్ గైక్వాడ్ చెప్పాడు. ఐపీఎల్ 2020 మొదట్లో రుతురాజ్కు కరోనా సోకడంతో సాధన చేసేందుకు కుదర్లేదు. ఆరంభ మ్యాచులు కూడా ఆడలేదు. ఆఖరి దశలో వరుస హాఫ్ సెంచరీలతో ఆకట్టుకున్నాడు.

ఐపీఎల్ 2020 ద్వారా అరంగేట్రం:
మహారాష్ట్రకు చెందిన రుతురాజ్ గైక్వాడ్ ఐపీఎల్ 2020 ద్వారా అరంగేట్రం చేశాడు. ఆరంభంలో కరోనా బారిన పడి జట్టుకు దూరమైన అతను వచ్చిన అవకాశాలను సరిగ్గా వినియోగించుకోలేకపోయాడు. కానీ సీజన్ ఎండింగ్తో దుమ్ములేపాడు. వరుసగా మూడు హాఫ్ సెంచరీలు బాది తన సత్తా ఏంటో తెలియజేశాడు. తాజా సీజన్లోనూ గైక్వాడ్ అదే జోరును కొనసాగించాడు. ఫాఫ్ డూప్లెసిస్తో కలిసి విలువైన భాగస్వామ్యాలు అందించాడు. ఈ సీజన్లో మొత్తం 7 మ్యాచ్లు ఆడిన రుతురాజ్.. 128.94 స్ట్రైక్రేట్తో 196 రన్స్ చేశాడు. సన్రైజర్స్ హైదరాబాద్తో జరిగిన మ్యాచ్లో 75 పరుగులు చేశాడు. గత రెండేళ్లుగా భారత్-ఏ తరఫున కూడా నిలకడగా రాణిస్తున్నాడు.


Click it and Unblock the Notifications
