సీఎస్కేకు ఐపీఎల్ 2026 సీజన్లో కష్టాలు ఏ మాత్రం తగ్గడం లేదు. వరుస గాయాలు జట్టును ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. తాజాగా సన్రైజర్స్ హైదరాబాద్తో జరిగిన మ్యాచ్లో అద్భుతమైన బ్యాటింగ్తో ఆకట్టుకున్న 18 ఏళ్ల యువ ప్లేయర్ ఆయుష్ మాత్రే హ్యామ్స్ట్రింగ్ గాయం కారణంగా రాబోయే కొన్ని మ్యాచ్లకు దూరమయ్యాడు. హైదరాబాద్పై కేవలం 13 బంతుల్లోనే 30 పరుగులు చేసిన ఆయుష్ మాత్రే.. రెండో రన్ తీసే క్రమంలో కండరాలు పట్టేయడంతో మైదానాన్ని వీడాడు. సోమవారం నిర్వహించే స్కాన్ తర్వాతే ఆయుష్ మాత్రే తిరిగి ఎప్పుడు జట్టులోకి వస్తాడనే విషయంపై స్పష్టత వస్తుందని బ్యాటింగ్ కోచ్ మైక్ హస్సీ పేర్కొన్నారు.
స్టార్ పేసర్ దూరం
జట్టులో బౌలింగ్ విభాగం కూడా గాయాల బారిన పడింది. సీఎస్కే స్టార్ పేసర్ ఖలీల్ అహ్మద్ తొడ గాయం కారణంగా టోర్నీ మొత్తానికి దూరమయ్యాడు. ఖలీల్ అహ్మద్ స్థానాన్ని భర్తీ చేసేందుకు సీఎస్కే యాజమాన్యం ముమ్మరంగా ప్రయత్నిస్తోంది. ముంబై ఇండియన్స్ మాజీ బౌలర్ ఆకాష్ మధ్వాల్ ఇప్పటికే జట్టు ట్రయల్స్లో పాల్గొనగా.. యువ ఆల్రౌండర్ రాజ్వర్దన్ హంగర్గేకర్ కూడా రేసులో ఉన్నాడు. డెత్ ఓవర్లలో పటిష్టంగా బౌలింగ్ చేయగల ఆటగాడి కోసం సీఎస్కే అన్వేషిస్తోంది.

తలా రీఎంట్రీపై కొనసాగుతున్న సస్పెన్స్
ఇక ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఎంఎస్ ధోనీ రీఎంట్రీపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. పిక్క కండరాల గాయం కారణంగా ఎంఎస్ ధోనీ ఈ సీజన్లో ఇప్పటివరకు ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. ప్రస్తుతం ఎంఎస్ ధోనీ నెట్స్లో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తున్నప్పటికీ.. వికెట్ల మధ్య పరిగెత్తడం ధోనీకి సవాలుగా మారింది. ఏప్రిల్ 23న వాంఖడే స్టేడియంలో ముంబై ఇండియన్స్ జట్టుతో జరిగే హై-వోల్టేజ్ మ్యాచ్లో ధోనీ బరిలోకి దిగుతాడని అభిమానులు ఆశిస్తున్నారు.
పాయింట్ల పట్టికలో దిగువన ఉన్న సీఎస్కే, ముంబై జట్లకు ఏప్రిల్ 23న జరిగే పోరు అత్యంత కీలకం కానుంది. ఆయుష్ మాత్రే వంటి కీలక బ్యాటర్ అందుబాటులో లేకపోవడంతో కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్, కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ తుది జట్టులో ఎలాంటి మార్పులు చేస్తారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఓ వైపు గాయాలు.. మరోవైపు పేలవమైన ఫామ్ మధ్య చెన్నై సూపర్ కింగ్స్ ఈ గండం నుంచి ఎలా గట్టెక్కుతుందో చూడాలి.