ఐపీఎల్ 2026 సీజన్లో సీఎస్కే తరఫున ఆడుతున్న సంజు శాంసన్ వరుసగా రెండు మ్యాచ్ల్లో విఫలమవ్వడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాజస్థాన్ రాయల్స్ నుంచి భారీ అంచనాలతో చెన్నై సూపర్ కింగ్స్ జట్టులోకి వచ్చిన సంజు శాంసన్.. ఇప్పటివరకు ఆడిన రెండు ఇన్నింగ్స్లలో కేవలం 6, 7 పరుగులు మాత్రమే చేసి నిరాశపరిచాడు. 2026 టీ20 ప్రపంచ కప్లో 'ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్'గా నిలిచిన ప్లేయర్ ఇలా వరుసగా విఫలమవ్వడంతో అభిమానుల నుంచి ఒత్తిడి పెరుగుతోంది. అయితే జట్టు హెడ్ కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ మాత్రం తమ ఆటగాడికి పూర్తి మద్దతుగా నిలిచారు.
ఒక్కసారి గేర్ మారిస్తే మ్యాచ్ విన్నరే..
మీడియా సమావేశంలో సంజు శాంసన్ ఫామ్ గురించి అడిగిన ప్రశ్నపై స్టీఫెన్ ఫ్లెమింగ్ స్పందిస్తూ.. విమర్శకులకు గట్టి సమాధానం ఇచ్చారు. ఆయన మాట్లాడుతూ.. " టీ20 క్రికెట్లో ప్రతి మ్యాచ్లోనూ పరుగులు సాధించడం సాధ్యం కాదు. సంజు శాంసన్ ప్రస్తుతం మంచి ఫామ్లోనే ఉన్నాడు. నెట్స్లో సంజు అద్భుతంగా ప్రాక్టీస్ చేస్తున్నాడు. కేవలం రెండు ఇన్నింగ్స్ల ఆధారంగా సంజు శాంసన్ సామర్థ్యాన్ని తక్కువగా అంచనా వేయలేం. ఒక్కసారి అతను ఫామ్ అందుకుంటే మ్యాచ్ విన్నర్గా నిలుస్తాడు. కాబట్టి సంజు శాంసన్ ఫామ్ గురించి మాకు ఎలాంటి ఆందోళన లేదు" అని స్టీఫెన్ ఫ్లెమింగ్ స్పష్టం చేశాడు.

చెపాక్లో సంజూ తడబాటు
గణాంకాలను పరిశీలిస్తే.. చెన్నైలోని చెపాక్ స్టేడియంలో సంజు శాంసన్ రికార్డు అంత ఆశాజనకంగా లేదు. ఈ స్టేడియంలో ఇప్పటివరకు 6 ఇన్నింగ్స్లలో సంజు శాంసన్ కేవలం 66 పరుగులు మాత్రమే చేశాడు. ఇక్కడ సంజు శాంసన్ సగటు 11 కాగా.. స్ట్రైక్ రేట్ 100గా ఉంది. ఐపీఎల్లో కనీసం 5 ఇన్నింగ్స్లు ఆడిన స్టేడియాల్లో సంజు శాంసన్కు ఇదే అత్యల్ప సగటు కావడం గమనార్హం. అయినప్పటికీ.. సీజన్లో ఇంకా చాలా మ్యాచ్లు మిగిలి ఉన్నాయని.. సంజు శాంసన్ ఖచ్చితంగా పుంజుకుంటాడని సీఎస్కే యాజమాన్యం ధీమా వ్యక్తం చేస్తోంది.
గత సీజన్లో పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్.. ఈ సీజన్లో కూడా ఆరంభంలోనే వరుసగా రెండు ఓటములను చవిచూసింది. రాజస్థాన్ రాయల్స్, పంజాబ్ కింగ్స్ జట్లతో జరిగిన మ్యాచ్ల్లో ఓటమి పాలైన సీఎస్కే.. ఇప్పుడు తన తదుపరి మ్యాచ్లో ఢిఫెండింగ్ ఛాంపియన్ ఆర్సీబీతో తలపడనుంది. ఆదివారం జరగబోయే ఈ కీలక పోరులోనైనా సంజు శాంసన్ ఫామ్లోకి వచ్చి జట్టుకు తొలి విజయాన్ని అందిస్తాడని అభిమానులు ఆశిస్తున్నారు.