ఫాఫ్, బ్రావోలకు గాయాలు:
ఐపీఎల్ 2021 రెండో దశకు ముందు చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు భారీ షాక్ తగిలింది. చెన్నై స్టార్ ఆటగాళ్లు ఇద్దరు గాయపడగా.. మరో ఇద్దరు ప్లేఆఫ్స్ మ్యాచులకు అందుబాటులో ఉండరని సమాచారం తెలుస్తోంది. సీపీఎల్ 2020లో ఆడుతున్న డ్వేన్ బ్రావో, ఫాఫ్ డుప్లెసిస్ గాయాల బారిన పడ్డారు. గాయం కారణంగాబ్రావో సీపీఎల్ 2020లో బౌలింగ్ చేయడం లేదు. కేవలం బ్యాట్స్మన్గా మాత్రమే సేవలందిస్తున్నాడు. దాంతో ఐపీఎల్ టోర్నీలో కూడా అతడు బౌలింగ్ చేసే అవకాశాలు లేవు. ఇక ఫాఫ్ గాయంపై ఇప్పటికి స్పష్టత లేదు. టోర్నీకి మరో వారం సమయం ఉంది కాబట్టి అప్పటిలోగా అతడు కోలుకునే అవకాశాలు ఉన్నాయి. గాయం తీవ్రత ఎక్కువగా ఉంటే మాత్రం అతడు కొన్ని మ్యాచులకు దూరం కావాల్సి ఉంటుంది.
ప్లేఆఫ్స్ మ్యాచులకు కరన్, అలీ దూరం:
ఇక ఇంగ్లండ్ ప్లేయర్స్ సామ్ కరన్, మొయిన్ అలీ ఐపీఎల్ 2021 ప్లేఆఫ్స్ మ్యాచులకు అందుబాటులో ఉండరట. ఐపీఎల్ అనంతరం రెండు రోజుల్లో ప్రారంభమయ్యే టీ20 ప్రపంచకప్ 2021 కోసం ఈ ఇద్దరు బయో బబుల్లోకి వెళ్లిపోనున్నారు. ఈసీబీ నిబంధనల ప్రకారం కరన్, అలీ ఇంగ్లండ్ బృందంలో చేరనున్నారు. స్టార్ ఆటగాళ్లు దూరం కానున్న నేపథ్యంలో చెన్నై టైటిల్ కొట్టడం కష్టంగా మారనుంది. ఐపీఎల్ 2021 సీజన్ వాయిదాపడే సమయానికి 7 మ్యాచ్లాడిన చెన్నై.. ఐదింట్లో గెలుపొంది పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉంది. మరో మూడు మ్యాచులు గెలిస్తే ప్లేఆఫ్స్ బెర్త్ ఖాయం. అయితే మొదటి దశలో ఫాఫ్, అలీ, కరన్ కీలక పాత్ర పోషించారు. ఇప్పుడు వీరు అందుబాటులో లేకుంటే.. ప్లేఆఫ్స్ చేరడం కాస్త కష్టమనే చెప్పాలి.
సీపీఎల్లో అదరగొట్టిన ఫాఫ్, బ్రావో:
ఐపీఎల్ 2021 తొలి దశలో చెన్నై తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడు ఫాఫ్ డుప్లెసిస్.. ప్రస్తుతం సీపీఎల్లో ఆడుతున్నాడు. అతని బ్యాట్ నుంచి పరుగుల సునామీ కొనసాగుతోంది. సెయింట్ లూసియా తరపున ఆడుతున్న ఫాఫ్ తాజాగా 54 బంతుల్లో 84 పరుగుల ధనాధన్ ఇన్నింగ్స్ ఆడాడు. ఈ ఇన్నింగ్స్లో నాలుగు ఫోర్లు, నాలుగు సిక్సర్లు బాదాడు. అతని స్ట్రైక్ రేట్ 155.56గా నమోదైంది. అంతకుముందు 200 స్ట్రైక్ రేట్తో 120 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. ప్రస్తుత సీపీఎల్ సీజన్లో డ్వేన్ బ్రావో ఏడు మ్యాచ్ల్లో 39.00 సగటుతో 78 పరుగులు చేశాడు. గాయపడకముందు బార్బడోస్ రాయల్స్పై నాలుగు ఓవర్లలో 26 పరుగులిచ్చి నాలుగు వికెట్లు తీసుకున్నాడు. కరన్, అలీ కూడా టీమిండియాపై మోస్తరు ప్రదర్శన చేశారు.
ఆగస్టు 13నే యూఏఈకి:
ఐపీఎల్ 2021 కోసం చెన్నై టీమ్ ఆగస్టు 13న దుబాయ్ చేరుకుంది. వారం రోజుల పాటు దుబాయ్లోని పామ్ హోటల్లో చెన్నై ప్లేయర్స్ క్వారంటైన్ అయ్యారు. క్వారంటైన్ గడువు అనంతరం దుబాయ్లోని ఐసీసీ క్రికెట్ అకాడమీలో ప్రాక్టీస్ ఆరంభించారు. దాదాపు 20 రోజుల నుంచి చెన్నై ప్లేయర్స్ సాధన చేస్తున్నారు. చెన్నై హెడ్ కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ ఆటగాళ్ల సాధనను దగ్గరుండి మరి పరీక్షిస్తున్నాడు. కెప్టెన్ ఎంఎస్ ధోనీ, మిస్టర్ ఐపీఎల్ సురేష్ రైనా, పేసర్ దీపక్ చహర్, ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్, సీనియర్ ఓపెనర్ రాబిన్ ఉతప్ప, స్పిన్నర్ కరన్ శర్మ సహా పలువురు ఆటగాళ్లు సాధన చేస్తున్నారు. టెస్ట్ సిరీస్ ఆడిన రవీంద్ర జడేజా, చేతేశ్వర్ పుజారా, శార్దూల్ ఠాకూర్, మోయిన్ అలీ మరియు సామ్ కరన్లు క్వారంటైన్ అనంతరం జట్టుతో చేరనున్నారు.