CSK vs RCB మధ్య 'దోశ-ఇడ్లీ' చిచ్చు..!
ఐపీఎల్ 2026 సీజన్లో బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), చెన్నై సూపర్ కింగ్స్ (CSK) మధ్య జరిగిన మ్యాచ్ కొత్త వివాదానికి తెరలేపింది. ఆటగాళ్లు పోరాడుతుండగా, డీజే ప్రవర్తనే ఇప్పుడు చర్చనీయాంశమైంది. తమను కించపరిచేలా పాటలు, వ్యాఖ్యలు చేశాడంటూ సీఎస్కే యాజమాన్యం బీసీసీఐకి అధికారికంగా ఫిర్యాదు చేసింది.
వివాదానికి ప్రధాన కారణం "దోశ, ఇడ్లీ, సాంబార్, చట్నీ" పాట. ఇది దక్షిణ భారతీయులను, ముఖ్యంగా తమిళులను గేలి చేసేందుకు సోషల్ మీడియాలో వాడే ట్రాక్. అటువంటి దానిని అధికారిక ఐపీఎల్ మ్యాచ్లో, సీఎస్కే ఆడుతున్నప్పుడు ప్లే చేయడం 'బ్యాడ్ టేస్ట్' అని చెన్నై యాజమాన్యం మండిపడింది. కేవలం వినోదం కాదని, ఇది ప్రాంతీయ వివక్ష అని వారు ఫిర్యాదులో పేర్కొన్నారు.

డీజే ప్రవర్తనపై సీఎస్కే తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. చెన్నై ప్లేయర్లు ఔట్ అయిన ప్రతిసారి డీజే మైక్ ద్వారా అనుచిత వ్యాఖ్యలు చేశారని మేనేజింగ్ డైరెక్టర్ కాశీ విశ్వనాథన్ ఆరోపించారు. "హోమ్ టీమ్కు మద్దతు ఇవ్వడం డీజే బాధ్యత, కానీ ప్రత్యర్థి జట్టును తక్కువ చేయడం లేదా వారిని అవమానించడం క్రీడా స్ఫూర్తికి విరుద్ధం. చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఈ ఘటనలు దురదృష్టకరం" అని అసంతృప్తి వెలిబుచ్చారు. గతంలోనూ ఇలాంటివి జరిగాయని, బీసీసీఐ కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.
సీఎస్కే ఫిర్యాదును బీసీసీఐ స్వీకరించినట్లు ఉన్నతాధికారి ఒకరు స్పష్టం చేశారు. ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ దీనిని ప్రస్తుతం పరిశీలిస్తోంది. స్టేడియాల్లో పాటల ఎంపిక, డీజేల ప్రవర్తనపై నిర్దిష్ట నియమ నిబంధనలు ఉంటాయని, వాటిని ఉల్లంఘించినట్లు తేలితే సంబంధిత వ్యక్తులపై లేదా గ్రౌండ్ అసోసియేషన్పై చర్యలు తీసుకునే అవకాశం ఉందని ఆయన వివరించారు.
ఈ వివాదం సోషల్ మీడియాలో ఫ్యాన్స్ వార్కి దారితీసింది. ఇది స్టేడియం ఉత్సాహానికే అని ఆర్సీబీ అభిమానులు వాదిస్తుండగా, తమ జట్టును అవమానించడమేనని సీఎస్కే అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఐపీఎల్ 2026 పాయింట్ల పట్టికలో ఆర్సీబీ అగ్రస్థానంలో ఉండగా, సీఎస్కే ఎనిమిదో స్థానంలో ఉంది. ఈ 'డీజే వివాదం' లీగ్లో మరింత వేడిని పెంచింది. బీసీసీఐ నిర్ణయం కోసం క్రీడా వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications