హైదరాబాద్: చెన్నైలోని చెపాక్ స్టేడియంలో శనివారం నాడు తమిళనాడు ప్రీమియర్ లీగ్ (టీఎన్పీఎల్) అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. టీఎన్పీఎల్ ఓపెనింగ్ డేకి విచ్చేసిన టీమిండియా మాజీ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోని అభిమానులను హ్యాట్రిక్ సిక్సర్లతో అలరించాడు.
అభిమానులు చూస్తుండగా వరుసగా మూడు బంతుల్ని సిక్సులుగా మలిచాడు. వివరాల్లోకి వెళితే... శనివారం చెన్నైలోని చెపాక్ స్టేడియంలో తమిళనాడు ప్రీమియర్ లీగ్లో భాగంగా మ్యాచ్కి ముందు చెన్నై సూపర్ కింగ్స్ పునరాగమన కార్యక్రమం అట్టహాసంగా జరిగింది.

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో మ్యాచ్ ఫిక్సింగ్ నేపథ్యంలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుపై సుప్రీంకోర్టు రెండేళ్ల పాటు నిషేధం విధించిన విషయం తెలిసిందే. ఇటీవల ఆ నిషేధం ముగియడంతో శనివారం పునరాగమనం కార్యక్రమాన్ని ఫ్రాంఛైజీ నిర్వహించింది.
ఈ సందర్భంగా చెన్నై సూపర్ కింగ్స్ జట్టు జరుపున ఆడిన ప్రముఖ క్రికెటర్లు ఈ కార్యక్రమానికి జెర్సీలు ధరించి హాజరయ్యారు. ఈ సందర్భంగా 'సిక్స్ హిట్టింగ్ కాంటెస్ట్'ని నిర్వహించారు. సీనియర్ క్రికెటర్లు లక్ష్మీపతి బాలాజీ, మోహిత్ శర్మ, పవన్ నేగి తదితరులు కాసేపు బ్యాటింగ్ చేసి ఆకట్టుకున్నారు.
వీరికి బౌలింగ్ మిషన్ ద్వారా ధోనీ కొన్ని బంతులు కూడా విసిరాడు. ఆ తర్వాత బ్యాటింగ్కి దిగిన ధోని ట్రైల్ రూపంలో విసిరిన బంతిని హిట్ చేయడంలో విఫలమయ్యాడు. కానీ ఆ తర్వాత వరుసగా మూడు బంతుల్ని తనదైన షాట్లతో సిక్సులుగా మలిచాడు.
ఆ తర్వాత మ్యాచ్లో టాస్ ఎగురవేసిన ధోని.. పిచ్ రిపోర్ట్ని స్వయంగా మైక్లో చెప్పి అభిమానుల్ని అలరించాడు. ధోని బాదిని హ్యాట్రిక్స్ సిక్సర్ల వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఈ వీడియోలో ధోని 'తలా' అని రాసి ఉన్న చెన్నై సూపర్ కింగ్స్ జెర్సీని ధరించాడు.