
హైదరాబాద్: ఐపీఎల్ టోర్నీలో భాగంగా శుక్రవారం రాత్రి చెన్నై సూపర్ కింగ్స్-రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో ఓ ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన చెన్నై ఇన్నింగ్స్లో వన్డౌన్ బ్యాట్స్మెన్ సురేశ్ రైనా ఔట్ అయిన అనంతరం ధోనీ బ్యాటింగ్కు వెళ్తున్నాడు.
ఈ క్రమంలో చెన్నై అభిమాని అక్కడి సిబ్బందిని సైతం నెట్టుకొని వచ్చి ధోని పాదాలపై పడ్డాడు. అంతటితో ఆగకుండా ఉద్వేగంతో ధోనీని హత్తుకొని ఆనందంతో పొంగిపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. అయితే, స్టేడియం సిబ్బందిని దాటుకుని ధోని కాళ్లకు మొక్కడం ఇదే తొలిసారి కాదు.
ఇటీవల ధోని ఓ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమానికి వెళ్లినప్పుడు ఇలాంటి సంఘటనే చోటు చేసుకుంది. బహుమతి తీసుకోవాడానికి వచ్చిన ఓ యువ ఆటగాడు వేదికపై ఒక్కసారిగా ధోనీ కాళ్లకు మొక్కాడు. ధోనీ అతన్ని బలవంతంగా పైకి లేపి బహుమతి ప్రదానం చేశాడు. ఈ ఘటనపై మిగతా అభిమానులు తెగ కామెంట్లు చేస్తున్నారు.
ఇదిలా ఉంటే స్పాట్ ఫిక్సింగ్ వివాదం కారణంగా రెండేళ్ల విరామనం తర్వాత పునరాగమనం చేసిన చెన్నై సూపర్ కింగ్స్కు అభిమానులు తొలి మ్యాచ్లోనే బ్రహ్మరథం పట్టారు. కావేరీ జల వివాదం కారణంగా ఐపీఎల్ నిర్వాహకులు చెన్నైలో జరగాల్సిన మ్యాచ్లను పూణెకు తరలించిన సంగతి తెలిసిందే.
ఇదిలా ఉంటే వాట్సన్ సెంచరీతో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 204 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య చేధనకు దిగిన రాజస్థాన్ రాయల్స్ 18.3 ఓవర్లలో 140 పరుగులకే పరిమితమైంది. దీంతో చెన్నై 64 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది.