వినోదం హింసాత్మకంగా మారింది. రోహిత్ శర్మ ఔటైన తీరుపై విమర్శలు చేసిన చెన్నై సూపర్ కింగ్స్ అభిమానిపై ముంబై ఇండియన్స్ అభిమానులు దారుణంగా దాడి చేశాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన సదరు సీఎస్కే అభిమాని చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ సంఘటన మహారాష్ట్రలోని కొల్షాపూర్లో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. ఉప్పల్ వేదికగా మార్చి 27వ తేదీన ముంబై ఇండియన్స్- సన్రైజర్స్ హైదరాబాద్ మధ్య మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. ఈ పోరులో ఎస్ఆర్హెచ్ ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోరు సాధించింది. 277 పరుగులు బాది ఆల్టైమ్ రికార్డు సృష్టించింది. అయితే ఈ మ్యాచ్ను కొల్హాపూర్లో కొంతమంది కలిసి వీక్షించారు.

వాళ్లలో కొందరు సీఎస్కే, మరికొందరు ముంబై అభిమానులు ఉన్నారు. అయితే రోహిత్ శర్మ 12 బంతుల్లో 26 పరుగులు చేసి పెవిలియన్కు చేరాడు. కమిన్స్ బౌలింగ్లో అభిషేక్ శర్మకు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. దాంతో హిట్ మ్యాన్ వికెట్ను చెన్నై ఫ్యాన్ అయిన 63 ఏళ్ల బండోపంత్ బాపుసో టిబిలే సంబరాలు చేసుకున్నాడు. ఔటైన తీరును విమర్శిస్తూ హేళనగా మాట్లాడాడు.
ఈ క్రమంలో ఆవేశానికి గురైన ముంబై ఇండియన్స్ అభిమానులు సదాశివ్ (35), బల్వంత్ (50).. బండోపంత్పై విచక్షణరహితంగా కర్రలతో దాడికి దిగారు. అనంతరం అక్కడ ఉన్న వాళ్లు బండోపంత్ను ఆస్పుత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆయన నిన్న మరణించాడు. కాగా, దాడికి పాల్పడిన వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటన నెట్టింట వైరల్గా మారింది. వినోదాత్మకమైన ఆట కోసం ప్రాణాలు తీయడమేంటని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. అభిమానానికి ఓ హద్దు ఉండాలని అంటున్నారు.