ఐపీఎల్-2024 సీజన్ అర్ధభాగం ముగిసింది. కొన్ని జట్లు సగం మ్యాచ్లు, మరికొన్ని జట్లు అంత కంటే ఎక్కువ మ్యాచ్లు ఆడేశాయి. దీంతో ప్లేఆఫ్స్కు చేరే టీమ్స్ గురించి దాదాపు క్లారిటీ వచ్చేసింది. గత సీజన్లలో కనీసం ఎనిమిది మ్యాచ్లు గెలిచి మెరుగైన నెట్ రన్రేటును కలిగి ఉన్న జట్లు నాకౌట్ దశకు చేరుకున్నాయి.
ఈ లెక్క ప్రకారం రాజస్థాన్ రాయల్స్ ప్లేఆఫ్స్కు దూసుకెళ్లడం ఖాయంగా అనిపిస్తోంది. ఎనిమిది మ్యాచ్లు ఆడిన రాజస్థాన్ ఏడింట్లో గెలిచి టేబుల్ టాప్లో ఉంది. కోల్కతా నైట్ రైడర్స్, సన్రైజర్స్ హైదరాబాద్ జట్లు కూడా తదుపరి దశకు చేరుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇరు జట్లు చెరో అయిదు మ్యాచ్ల్లో గెలిచి పది పాయింట్లు సాధించాయి.

జోరు మీదున్న ఈ రెండు జట్లు మరో మూడు మ్యాచ్లు గెలవడం అంత కష్టమేమి కాదనిపిస్తోంది. అంతేగాక మెరుగైన రన్రేట్ ఈ జట్లకు అదనపు బలంగా మారింది.దీంతో కోల్కతా, హైదరాబాద్ జట్లు కూడా ప్లేఆఫ్స్ చేరుకోవడం దాదాపు ఖాయమే. అయితే అసలు పోటీ నాలుగో స్థానంపై ఏర్పడింది. టాప్-4లో చెన్నై సూపర్ కింగ్స్ ఉన్నప్పటికీ లక్నో సూపర్ జెయింట్స్ కారణంగా ప్లేఆఫ్స్పై ధైర్యంగా ఉండలేని పరిస్థితి తలెత్తింది.
సీఎస్కే, లక్నో, గుజరాత్ టైటాన్స్ జట్లు నాలుగింట్లో గెలిచి ఎనిమిది పాయింట్లతో వరుసగా నాలుగు, అయిదు, ఆరు స్థానాల్లో ఉన్నాయి. అయితే చెన్నై, లక్నో ఏడు మ్యాచ్లే ఆడగా, గుజరాత్ ఎనిమిది మ్యాచ్లు ఆడాయి. దీంతో సీఎస్కేకు లక్నో, గుజరాత్ నుంచి అసలు సమస్య ఎదురుకానుందని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ముంబై ఇండియన్స్ కూడా తక్కువగా అంచనా వేయలేం. సీజన్ ఆఖర్లో ముంబై వరుస విజయాలతో ప్లేఆఫ్స్కు చేరే అవకాశాలూ ఉన్నాయి.
మరోవైపు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్ ప్లేఆఫ్స్ అవకాశాలు సంక్లిష్టంగా మారాయి. అయితే ఈ మూడు జట్లకు కూడా ఇంకా ఛాన్స్ మిగిలి ఉంది. వరుస విజయాలు సాధిస్తూ మెరుగైన రన్రేటు సాధిస్తే తదుపరి దశకు చేరే ఛాన్స్ ఉంటుంది.