ఐపీఎల్ మెగా వేలానికి ముహుర్తం ఖరారైంది. సౌదీ అరేబియాలోని జెడ్డా వేదికగా నవంబర్ 24, 25వ తేదీల్లో మెగా ఆక్షన్ను నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో మెగా వేలంలో ఏఏ ఆటగాళ్లను సొంతం చేసుకోవాలని ఫ్రాంచైజీలు కసరత్తులు మొదలుపెట్టాయి. చెన్నై సూపర్ కింగ్స్ పదునైన వ్యూహాలతో మెగా ఆక్షన్లో బరిలోకి దిగుతోంది.
రూ.65 కోట్లు వెచ్చించి ఎంఎస్ ధోనీతో సహా అయిదుగురు ఆటగాళ్లను సీఎస్కే రిటైన్ చేసుకున్న విషయం తెలిసిందే. అయితే మిగిలిన రూ.55 కోట్లతో దాదాపు 20 మందిని కొనుగోలు చేయాల్సి ఉంది. అందులో ఏడురుగు విదేశీ ప్లేయర్లను తీసుకోవాల్సి ఉంది. ఈ క్రమంలో అయిదు సార్లు విజేతగా నిలిచిన సీఎస్కే ఇతర ఫ్రాంచైజీల ఊహాలకు అందకుండా ప్రణాళికలు రచిస్తోంది. మెగా వేలంలో సొంతం చేసుకోవాల్సిన ఆటగాళ్ల లిస్ట్ను దాదాపుగా ఖరారు చేసింది.

తుదిజట్టు ఆధారంగా వేలంలో ఆటగాళ్లను సొంతం చేసుకోవాలని సీఎస్కే భావిస్తోంది. రుతురాజ్ గైక్వాడ్ (రూ.18 కోట్లు), మతీష పతిరనా (రూ. 13 కోట్లు), శివమ్ దూబె (రూ.12 కోట్లు), రవీంద్ర జడేజా (రూ.18 కోట్లు), ఎంఎస్ ధోనీ (రూ.4 కోట్లు)లను రిటైన్ చేసుకుంది. కెప్టెన్ రుతురాజ్ ఓపెనర్గా రానుండటంతో టాప్ ఆర్డర్లో మిగిలిన ఇద్దరి కోసం ప్రణాళికలు రచిస్తోంది. గత సీజన్లలో డెవాన్ కాన్వే సీఎస్కేకు శుభారంభాల్ని అందించాడు. అంతేగాక రుతురాజ్-కాన్వే రైట్-లెఫ్టార్మ్ కాంబినేషన్ సూపర్ హిట్గా నిలిచింది. ఈ నేపథ్యంలో కాన్వేను దక్కించుకోవడానికి సీఎస్కే గట్టి ప్రయత్నమే చేయనుంది.
కాన్వేతో పాటు రచిన్ రవీంద్ర, రాహుల్ త్రిపాఠిని వేలంలో సొంతం చేసుకోవాలని చూస్తోంది. అయితే ఊహాగానాలకు తగ్గట్లుగా రిషభ్ పంత్ కోసం సీఎస్కే వేలంలో పోటీపడటానికి సిద్ధంగా లేదు. వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ కోసం పెద్దమొత్తాన్ని వెచ్చించాలని ప్లాన్ చేస్తోంది. తమ ప్లాన్లో పంత్ లేకపోవడంతోనే రుతురాజ్కు రూ.18 కోట్లు వెచ్చించి చెన్నై రిటైన్ చేసుకుంది. ఇషాన్ కిషన్ను సొంతం చేసుకుంటే ధోనీ వారసుడు దొరకడంతో పాటు, టాప్ ఆర్డర్ బలోపేతంగా మారుతుంది.
ఇక నాలుగో స్థానంలో శివమ్ దూబె ఖరారు అయ్యాడు. అయిదో స్థానంలో స్పెషలిస్ట్ బ్యాటర్ లేదా స్పిన్ ఆల్రౌండర్ను తీసుకోవాలని సీఎస్కే భావిస్తోంది. గ్లెన్ మ్యాక్స్వెల్, గ్లెన్ ఫిలిప్స్, మిచెల్ శాంట్నర్, లివింగ్స్టోన్లలో ఒకరిని వేలంలోకి దక్కించుకోవాలని యోచిస్తోంది. అయితే మ్యాక్సీ, లివింగ్స్టోన్ కోసం ఆయా మాజీ ఫ్రాంచైజీలు వేలంలో ఆర్టీఎమ్ ఆప్షన్ ఉపయోగించే అవకాశం ఉంది. ఇక బ్యాటింగ్ ఆర్డర్లో తర్వాత రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోనీ ఉండటంతో భారత స్పిన్ ఆల్రౌండర్లను దక్కించుకోవాలని చెన్నై ఫ్రాంచైజీ భావిస్తోంది.
లోకల్ ప్లేయర్లు వాషింగ్టన్ సుందర్, రవిచంద్రన్ అశ్విన్లలో ఒకరిని పెద్దమొత్తానికి అయినా కచ్చితంగా దక్కించుకోవాలని చూస్తోంది. ఇక మతీష పతిరనాతో డెత్ ఓవర్లలో కట్టుదిట్టంగా బౌలింగ్ వేసే బౌలర్లకు, అలాగే స్పెషలిస్ట్ స్పిన్నర్లకు పెద్ద మొత్తం వెచ్చించాలని సీఎస్కే భావిస్తోంది. సీఎస్కే మాజీ ప్లేయర్లపై ఎక్కువగా దృష్టి పెట్టింది. పేసర్లు దీపక్ చాహర్, శార్దూల్ ఠాకూర్, తుషార్ దేశపాండే, అన్షుల్ కాంబోజ్లతో పాటు ఎడమచేతి వాటం ఫాస్ట్ బౌలర్లు నటరాజన్, ఫజల్లా ఫరూకీ, జయదేవ్ ఉనద్కత్, ఖలీల్ అహ్మద్లను సొంతం చేసుకోవాలని ప్లాన్ చేస్తోంది. స్పిన్నర్లు మహేశ్ తీక్షణతో పాటు నూర్ అహ్మద్, సుయాష్ శర్మ, రాహుల్ చాహర్లలో ఒకరిని దక్కించుకోవాలనుకుంటుంది. కాగా, సీఎస్కేకు ఒక ఆర్టీఎమ్ కార్డ్ ఉంది.
మెగా వేలంలో సీఎస్కే చూసే ఆటగాళ్ల జాబితా (అంచనా)
విదేశీ ప్లేయర్లు: డెవాన్ కాన్వే, రచిన్ రవీంద్ర, ఫజల్లా ఫరూకీ, మహేశ్ తీక్షణ, నూర్ అహ్మద్, గ్లెన్ ఫిలిప్స్, గ్లెన్ మాక్స్వెల్/ లివింగ్స్టోన్/ విల్ జాక్స్
భారత ప్లేయర్లు: ఇషాన్ కిషన్, రాహుల్ త్రిపాఠి, సర్ఫరాజ్ ఖాన్, సుయాశ్ శర్మ, నటరాజన్, ఖలీల్ అహ్మద్, జయదేవ్ ఉనద్కత్, తుషార్ దేశ్పాండే, వాషింగ్టన్ సుందర్, రవిచంద్రన్ అశ్విన్, అన్షుల్ కాంబోజ్, సిమర్జిత్ సింగ్.